కేసీఆర్ శకుని… రేవంత్ కృష్ణుడు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను క్షష్ణుడితో పోల్చుకున్న ఆయన… ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శకునితో పోల్చారు. అసలు తనకు గుర్తింపు వచ్చిందే కేసీఆర్ వల్ల అని చెప్పిన రేవంత్ మరో అడుగు ముందుకేసి… శకుని లాంటి కేసీఆర్ లేకపోతే… తన లాంటి కృష్ణుడు లేడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాలనాగు కంటే ప్రమాదం అని ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

సోమవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి చాలా అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ నేతల వ్యవహారంపై స్పందించిన సందర్భంగా ఆయన ఏకంగా మహా భారతాన్ని ప్రస్తావించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడికి శకుని ఎలాగో… తెలంగాణలో తనకు కేసీఆర్ అలా అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి శకుని లేకుంటే తన లాంటి కృష్ణుడు లేడని ఆయన అన్నారు. కేసీఆర్ తోనే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందని, కేసీఆర్ లేకుంటే తనకు ఈపాటి గుర్తింపు వచ్చేది కాదన్నట్లుగా ఆయన అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజననూ ప్రస్తావించిన రేవంత్ రెడ్డి… డీలిమిటేషన్ తో బీజేపీ తనదైన శైలి జిత్తులను ప్రదర్శిస్తోందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కేవలం ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల వైపు బీజేపీ చూసే అవకాశమే లేదని కూడా ఆయన అన్నారు.

ఈ విషయాలను తెలుసుకోలేని తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ మొత్తం తనకే తెలిసినట్లుగా మాట్లాడుతున్నారని సెటైర్లు సంధించారు. ఏమాత్రం అవగాహన లేని లక్ష్మణ్ డాక్టర్ ఎలా అయ్యారోనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి.