ఎన్నెన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో విజయ్ కి ఆదిలోనే లెక్కలేనన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా… విజయ్ ఇప్పటిదాకా ప్రచారాన్నే మొదలుపెట్టలేదు. పోనీ ప్రచారం మొదలుపెట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నా… ఎన్నికల సంఘం ససేమిరా అంటోంది. ఓ వైపు ఎన్నికల గడువు వడివడిగా దగ్గరపడుతున్నా… విజయ్ మాత్రం ఎటూ కదలలేని స్థితిలో పడిపోయారు. మొన్నామధ్య కరూర్ లో తాను నిర్వహించిన ర్యాలీలో జరిగిన ప్రమాదమే ఆయనను అలా ఖాళీగా కూర్చోబెడుతోందని చెప్పక తప్పదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉందనగానే రంగంలోకి దిగిపోయారు. పార్టీని ప్రకటించిన తర్వాత సినిమాలను కాస్త పక్కనపెట్టిన విజయ్… రాష్ట్రాన్ని చుట్టేసే కార్యక్రమానికి తెర తీశారు. అయితే కరూర్ లో ఆయన చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 40 మంది చనిపోగా… 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో విజయ్ షాక్ తిన్నారు. అదే సమయంలో తమిళ రాజకీయ పార్టీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ఆయనను తమ వైపు లాక్కునే యత్నాలు చేశాయి. విజయ్ మాత్రం ఒంటరి పోరుకే కట్టుబడిపోయారు.
ఓ వైపు కరూర్ ఘటనపై విచారణ కొనసాగుతుండగా… విజయ్ ప్రచారానికి ఎన్నికల సంఘం అడ్డు చెప్పేసింది. తాజాగా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… శనివారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో విజయ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన ఈసీని కోరారు.
అయితే కొన్ని షరతులను విజయ్ ముందు పెట్టిన ఈసీ… వాటికి ఒప్పుకుంటే తప్పించి అనుమతి ఇవ్వబోమంటూ ఆయను షాకిచ్చింది. రోజుకు 5 మీటింగుల కంటే మించి ప్రచారం నిర్వహించరాదని, ఆ ఐధు మీటింగులు కూడా నిర్దేశిత సమయంలోగానే ముగించాలని ఈసీ షరతు పెట్టింది. ఈ షరతులను విన్న విజయ్… ఎలా స్పందించాలో తెలియక అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో విజయ్ పార్టీ ఏ రీతిన సత్తా చాటుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates