టీడీపీ @ 45… ఇది కొంచెం వేరు తమ్ముళ్ళు

టీడీపీలో మరో పండుగ. రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున త‌మ్ముళ్లు ఘ‌నంగా నిర్వ‌హించుకునే పండుగ‌.. అదే పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం. 1982, మార్చి 29న తెలుగు వారి అన్న‌గారు.. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు(ఎన్టీఆర్‌) స్థాపించిన పార్టీ తెలుగు దేశం. ఈ పేరును అప్ప‌టి ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత‌.. సింగిరెడ్డి నారాయ‌ణ రెడ్డి సూచించార‌ని అంటారు. పార్టీ పేరును సూచించాల‌ని అన్న‌గారు కోరిన‌ప్పుడు.. నారాయ‌ణ‌రెడ్డి.. రెండు రోజుల స‌మ‌యం తీసుకుని.. ఈ పేరును సూచించ‌గానే..అన్న‌గారు వెంట‌నే ఆమోదించారు.

కాగా.. అనేక ఉత్థాన ప‌త‌నాల‌ను చ‌విచూసిన పార్టీ.. ఆదివారం 45వ పుట్టిన రోజును జ‌రుపుకుంటోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఆవిర్భావ వేడుక‌ల‌కు ఇప్పుడు జ‌రుగుతున్న ఆవిర్భావ వేడుక‌కు చాలా తేడా ఉంది. రాష్ట్రంలో పార్టీనాయ‌క‌త్వంపై పెద్ద ఎత్తున స‌వాళ్లు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో.. భవిష్య‌త్తు వ్యూహాన్ని ఆవిష్క‌రించ‌నున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా పార్టీలో ప్ర‌స్తుతం నెంబ‌ర్ 2గా ఉన్న నారా లోకేష్‌కు మ‌రింత బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇదేస‌మ‌యంలో యువ‌త‌ను కేంద్రంగా చేసుకుని.. పార్టీని వారికి మ‌రింత చేరువ చేసేందుకు కూడా ప్ర‌యత్నాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారికి మ‌రింత చోద‌క శ‌క్తి అందించేలా.. యువజ‌న విభాగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అలానే.. పార్టీలో కొత్త‌గా సీనియ‌ర్ల విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే వైసీపీలో పీఏసీని ఏర్పాటు చేశారు. సీనియ‌ర్లు.. ఈ విభాగంలో చేరుస్తున్నారు. త‌ద్వారా.. వారి వ‌ల్ల వ‌చ్చే పోటీని అధిగ‌మించ‌నున్నారు.

అదేస‌మ‌యంలో స‌ల‌హాలు.. సంప్ర‌దింపుల‌కు వారిని వినియోగించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీలోనూ పీఏసీ వేయాల‌ని కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజా ఆవిర్భావ వేడుక‌ల్లో ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

అలానే.. పార్టీ ప‌రంగా 33 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ఉన్న‌ట్టుగానే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు కూడా.. పార్టీపరంగా సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంటే.. వారికి కూడా నిర్దిష్టంగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేందుకు `రిజ‌ర్వేష‌న్‌` అంశాన్ని ప్ర‌తిపాదిస్తార‌ని స‌మాచారం. మొత్తంగా.. సంచ‌ల‌నాల వేదిక‌గానే ఈ ద‌ఫా పార్టీ ఆవిర్భావ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు.