ద‌క్షిణాదిపై కేంద్రం ప‌ట్టు.. ప్ర‌మోద‌మా? ప్ర‌మాద‌మా?

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం (కూట‌మి) ప‌ట్టు పెంచుకుంటోందా? రాజ‌కీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉత్త‌రాదిపై ఇప్ప‌టికే బీజేపీ ప‌ట్టు బిగించింది. ఢిల్లీ నుంచి యూపీ వ‌ర‌కు.. ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిశాల దాకా కూడా విస్త‌రించింది. నిజానికి ఒడిశాలో 30 ఏళ్ల బీజేడీ పాల‌న‌కు తెర‌దించి.. క‌మ‌లం విక‌సించింది.

ఇక‌, ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారూ. ద‌క్షిణాదిలో ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాలు, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో క‌ర్ణాట‌క‌లో మాత్ర‌మే బీజేపీ భారీ బ‌లాన్ని సంత‌రించుకుంది. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు అధికారంలోకి కూడా వ‌చ్చింది. ఇక‌, ఏపీలో కూట‌మి క‌ట్టి బీజేపీ రెండో సారి అధికారం ద‌క్కించుకుంది. 2014–18 వ‌ర‌కు, 2024 నుంచి ప్ర‌స్తుత కాలం వ‌ర‌కు టీడీపీతో క‌లిసి పాల‌న చేస్తోంది.

ఇక‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌లలో మాత్రం బీజేపీ ఉనికి నామ‌మాత్రంగా ఉంది. పుదుచ్చేరి లో వ‌రుస‌గా రెండు సార్లు.. ఎన్. రంగ‌స్వామితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది.. నిన్న‌టి మాట‌. కానీ, ఉత్త‌రాది వైపు ప్ర‌భావం కొంత త‌గ్గుతున్న క్ర‌మంలో, 2029 నాటికి ద‌క్షిణాదిపై పూర్తి ప‌ట్టు బిగించేందుకు బీజేపీ ప్ర‌యత్నాలు ముమ్మ‌రం చేశారు. అందుకే.. ప్ర‌స్తుతంగా జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ద‌క్షిణాదిలోని కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో స‌ర్దుబాటు రాజ‌కీయాల‌కు తెర‌దీసింది.

త‌ద్వారా ఇప్పుడు పుంజుకుని.. భ‌విష్య‌త్తులో ఎదిగేందుకు అవ‌కాశం ఉన్న అన్ని మార్గాల‌ను రెడీ చేసుకుంటోంది. ఇలా.. బీజేపీ చేస్తున్న వ్యూహాల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాలలో అన్ని కులాలు, మ‌తాల వారు క‌ల‌సి క‌ట్టుగా ఉంటున్నారు. మ‌త‌ప‌రమైన రాజ‌కీయాల‌కు పెద్ద ప్రాధాన్యం లేదు. బీజేపీ ఎంట్రీతో ఇప్పుడు కేర‌ళ‌, త‌మిళ‌నాడులో మ‌త‌ప‌రంగా ఓట్లు చీలుతున్నాయ‌న్న వాద‌న బ‌ల‌ప‌డుతోంది. ఇదే జ‌రిగితే.. భ‌విష్య‌త్తులో ప్ర‌మాద‌క‌ర సంకేతాల‌కు తావిచ్చిన‌ట్టేన‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.