అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీజ‌న్ ఉంది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఉత్త‌రాంధ్ర‌లో న‌ష్టం జ‌ర‌గ్గా.. కుల స‌మీక‌ర‌ణ‌ల విష‌యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ న‌ష్ట‌పోయింది. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని చుల‌కన చేస్తున్నార‌న్న వాద‌న‌తో పాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖ‌రితో సీమ‌లో వైసీపీకి గండి ప‌డింది. ఇలా.. ప్రాంతానికి ఒక ర‌కంగా పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టింది.

మ‌రోవైపు.. కీల‌క‌మైన కోస్తాలోని విజ‌య‌వాడ‌, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు వంటి ప్రాంతాల్లో పార్టీ ప్రాభవం పోవ‌డానికి మూడు రాజ‌ధానుల నినాద‌మే కార‌ణం. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తిని చుల‌క‌న చేయడం.. దీనిని తీవ్రంగా విమ‌ర్శించ‌డం.. వంటివి బ‌లంగా ప‌నిచేశాయి. ఇలా .. రాజ‌ధాని ప్ర‌భావంతో కీలక మైన నాయ‌కులు కూడా వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, ఇటీవ‌ల కాలంలో వైసీపీ ఈ విష‌యంలో చూచాయ‌గా.. సానుకూల వాద‌న చేస్తోంది.

అమ‌రావ‌తికి తాము వ్య‌తిరేకం కాద‌ని.. త‌ర‌చుగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న ప్ర‌తిసారీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిపైనా ప్ర‌జ‌ల‌కు సందేహాలు ఉన్నాయి. అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ వైఖ‌రిపై అనేక అనుమానాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ త‌న‌ను తాను నిరూపించు కునేందుకు మంచి `ఛాన్స్‌` వ‌చ్చింది. చ‌ట్ట‌స‌భ వేదిక‌గానే.. అమ‌రావ‌తిపై త‌మ వైఖ‌రిని చెప్ప‌డం ద్వారా.. ప్ర‌జ‌లకు వివ‌ర‌ణ ఇచ్చేందుకు.. అమ‌రావ‌తిపై త‌మ స్టాండ్‌ను వెల్ల‌డించేందుకు అవ‌కాశం చిక్కింది.

ఈ నెల 28న అమ‌రావ‌తి రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే విష‌యంపై అసెంబ్లీలో తీర్మానం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి స‌భ‌ను ప్ర‌త్యేకంగా హాజ‌రు ప‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఆయ‌న ఎమ్మెల్యేలు.. స‌భ‌కు హాజ‌రై.. అమ‌రావ‌తిపై త‌మ స్టాండును వినిపించ‌డం చాలా వ‌ర‌కు మేలు చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అంతేకాదు.. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఉన్న అపోహ‌లు.. త‌ప్పించేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ ఒక్క స్టెప్‌తో వైసీపీకి కూడా భారీ మేలు జ‌రుగుతుంద‌ని ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు. మ‌రి ఈ అవ‌కాశాన్ని జ‌గ‌న్ ఏమేర‌కు వినియోగించుకుంటారో చూడాలి.