చిత్తూరు నేత‌ల‌ను మెప్పించ‌లేక పోయిన‌.. చంద్ర‌బాబు!

టీడీపీలో తిరుప‌తి ఎఫెక్ట్ బాగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధిం చి అంద‌రిక‌న్నా ముందుగానే టీడీపీ అధినేత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు. వాస్త‌వానికి ఇది పార్టీలో ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం. ఒక వేళ చంద్ర‌బాబు ఏమైనా సొంతంగా నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే.. అలా జ‌రిగే అవ‌కాశం కూడా క‌నిపించ‌డం లేదు. సీనియర్ల‌ను ఒక‌రో ఇద్ద‌రినో సంప్ర‌దించ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేదు. సో.. తిరుప‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు ఇలానే నిర్ణ‌యం తీసుకుని ఉంటే.. ఎవ‌రిని సంప్ర‌దించారు? జిల్లా నేత‌ల‌ను ఆయ‌న సంప్ర‌దించే నిర్ణ‌యం తీసుకున్నారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. ఏదైనా ఎన్నిక వ‌చ్చిన‌ప్పుడు.. ఎంపిక చేసే అభ్చ‌ర్థి విష‌యంలో అధిష్టానం ఒక‌టికి రెండు సార్లు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌నేది పార్టీ నేత‌ల అభిప్రాయం. సార్వ‌త్రిక స‌మ‌రంలో కొన్ని చోట్ల పొర‌పాట్లు జరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, ఎక్కువ మంది పోటీలో ఉండ‌డం.. ఎన్నిక‌ల హ‌డావుడి.. ప్ర‌త్య‌ర్థుల నాడి.. ఇలా అనేక కోణాల్లో సార్వ‌త్రిక స‌మ‌రం ఉంటుంది క‌నుక‌.. అప్పుడు ఏదైనా త‌ప్పులు జ‌రిగితే జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక‌కు ఇంకా ప్ర‌క‌ట‌నే రాలేద‌ని.. సో.. అలాంటి స‌మ‌యంలో ఇంత హ‌డావుడిగా అభ్య‌ర్థిని చేయ‌డం ఎందుకు? అనేది సీనియ‌ర్ల ప్ర‌శ్న‌. స‌రే.. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల‌కు అన్న‌ట్టుగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేసిన త‌ర్వాత ఇప్పుడు ఎందుకు త‌మ్ముళ్లు ఇలా అంటున్నార‌ని సందేహం వ‌స్తుంది.

అక్క‌డికే వ‌స్తే.. ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థిగా ప‌న‌బాక ల‌క్ష్మిని ఎంపిక చేశారు. రేపో మాపో ప్ర‌చారానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ‌.. రంగంలోకి దిగి.. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వారీగా టీడీపీ బ‌లాబ‌లాల‌పై స‌మీక్ష చేస్తున్నారు. ఈ స‌మ‌యంలోనే సీనియ‌ర్ల‌ను క‌లిసి రావాల‌ని.. ప్ర‌చార‌క‌మిటీని వేద్దామ‌ని.. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కొంద‌రికి క‌బురు పంపారు. అయితే.. పిలిచిన వారిలో కీల‌క‌మైన నేత‌లు.. చాలా మంది రాలేదు. అయితే.. వారు సోమిరెడ్డి కి కొంత స‌మాచారం చేర‌వేశారు. అందేంటంటే.. “గ‌త ఎన్నిక‌ల్లో మ‌న పార్టీ ప‌న‌బాక‌కు టికెట్ ఇచ్చింది. అయితే.. ఆమెపై ఇంకా కాంగ్రెస్ ముద్ర అలానే ఉంది. ఇప్ప‌టికీ ఆమెతో కాంగ్రెస్ నేత‌ల సంబంధాలు కొన‌సాగుతున్నాయి. మ‌న పార్టీలో నేత‌లు ఆమెతో క‌లిసి ప‌నిచేసే ప‌రిస్థితి లేదు. పైకి అంతా బాగానే ఉంద‌ని అనుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ కూడా ఇలానే ఆలోచిస్తోంది.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ల‌క్ష్మి.. డ‌బ్బు ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడారు. ఇక‌, ఇప్పుడు ఉప ఎన్నిక అంటే.. మ‌రింత ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. దీనికి ఆమె సిద్ధంగా లేర‌నే విష‌యం మ‌న‌కు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైంది. సో.. అస‌లు ఎంపికే బాగోలేదు. బాబు కొంచెం వెయిట్ చేసి ఉంటే బాగుండేది!“ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ.. ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప్ర‌క‌టించేశారు క‌నుక‌.. ఏదో ఒక విధంగా ప‌న‌బాక‌ను గ‌ట్టెక్కిద్దాం.. అంటూ.. సోమిరెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉన్నాయ‌ని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం.. చిత్తూరు నేత‌ల‌ను మెప్పించ‌లేక పోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం సోమిరెడ్డికి త‌ల‌కు మించిన ప‌నిగా మారింది. చివ‌రికి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి అంటున్నారు ప‌రిశీల‌కులు.