కరోనా సమయపు తెగువ మళ్ళీ చూపించాలి

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్‌పై దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాజ్యసభలో మంగళవారం ప్రసంగించిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సరఫరాలో ఆటంకాలు కలగవచ్చని, దీనివల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాల్లో అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు.

యుద్ధం వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు ఒక టీమ్ లాగా పనిచేయాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా కరోనా సమయంలో చూపిన తెగింపు ఇప్పుడు అవసరమని గుర్తు చేశారు. ఇలాంటి కష్టకాలంలో వలస కూలీలు, సామాన్యులు ఎక్కువగా ఇబ్బంది పడతారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉన్నందున, అక్రమ నిల్వలపై నిఘా ఉంచాలని సూచించారు.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఏడు ప్రత్యేక సాధికారిక బృందాలను ఏర్పాటు చేసింది. ఇంధనం, ఎరువులు, సరఫరా గొలుసు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై ఈ బృందాలు వ్యూహాలు రచిస్తున్నాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోయినా, దౌత్య పరంగా ఇతర మార్గాల ద్వారా ముడి చమురు, గ్యాస్ భారత్‌కు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మోదీ వివరించారు. దేశంలో ప్రస్తుతం సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

భారత్ తన వ్యూహాత్మక చమురు నిల్వలను 53 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే పనిలో ఉంది. గత పదేళ్లలో చమురు దిగుమతులను కేవలం కొన్ని దేశాలకే పరిమితం చేయకుండా, 27 నుంచి 41 దేశాలకు విస్తరించడం వల్ల ఇప్పుడు సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామని ప్రధాని తెలిపారు. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని, ఇప్పటివరకు 3.75 లక్షల మందిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ఇరాన్ నుంచి వచ్చిన వెయ్యి మంది వైద్య విద్యార్థులు కూడా ఉన్నారు.

ఏ యుద్ధమైనా మానవాళికి నష్టమేనని, శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోందని మోదీ అన్నారు. అంతర్జాతీయంగా ఎనర్జీ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశీయంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత 11 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు నిర్ణయాలే ఇప్పుడు దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతున్నాయని, భవిష్యత్తు సవాళ్లను కూడా ఇదే పట్టుదలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.