ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ అధిష్టానం సూచనల మేరకు చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో నారా లోకేష్ అస్సాంలో ప్రచారం చేయనున్నారు.
బెంగాలే ఎందుకు..?
చంద్రబాబుకు బెంగాల్ బాధ్యతలు ఇవ్వడంపై ఆసక్తి నెలకొంది. అక్కడి సీఎం మమతా బెనర్జీ ఒకప్పుడు చంద్రబాబుకు సన్నిహితురాలు. గతంలో ఆమెకు ఆయన మద్దతు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా బెంగాల్లో తెలుగు వారిలో చంద్రబాబుకు మంచి ఆదరణ ఉంది. ఈ కారణాల వల్లే ఆయనకు అక్కడ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.
ఇక నారా లోకేష్ అస్సాంలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అస్సాంలో యువ జనాభా ఎక్కువగా ఉండటం, గతంలో బీహార్ ఎన్నికల సమయంలో లోకేష్ యువతను ఆకట్టుకోవడంలో సఫలీకృతం కావడం బీజేపీకి ప్లస్గా కనిపిస్తోంది. అందుకే అస్సాంలో ఆయన ప్రచారం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇద్దరూ రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగాల్ బీజేపీకి కీలక రాష్ట్రంగా మారింది. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి బలమైన ప్రచారం అవసరమని పార్టీ భావిస్తోంది. మరోవైపు అస్సాంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా యువ నాయకత్వం ద్వారా ప్రచారం చేయిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి ఇతర రాష్ట్రాల నుంచి మిత్రపక్షాల నాయకులను రంగంలోకి దింపడం ద్వారా ఎన్నికల ప్రచారానికి కొత్త ఉత్సాహం తీసుకురావాలని ఎన్డీయే భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
