వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ, “అన్న అనే పదానికే కళంకం తీసుకొచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు” అని పేర్కొంటూ కుటుంబ సంబంధాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కడప ఎంపీ టికెట్ వివాదంతో సంబంధం ఉందని ఆరోపించారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఎంపికపై వివేకా అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ వ్యవహారాలను బహిరంగంగా తీసుకువచ్చి రచ్చ చేయడం తగదన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న విషయాలను రాజకీయ వేదికలపై ప్రస్తావించడం సమంజసం కాదని చెప్పారు. జగన్ తన చెల్లెలు షర్మిలకు ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించి, తండ్రికంటే ఎక్కువగా ఆదరించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపై “అన్న అనే పదానికి కళంకం” అని వ్యాఖ్యానించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై విమర్శలు చేయడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కుటుంబ గౌరవాన్ని బహిరంగంగా దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు.
రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడిగా జగన్ను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తుండగా, అదే వ్యక్తిపై ఆరోపణలు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని, కుటుంబ పరమైన విషయాలను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని రాచమల్లు సూచించారు. ఇదిలా ఉండగా, షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. రాజకీయ కారణాలతో కుటుంబ అంశాలను బయటకు తీసుకురావడం తగదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
