శ్రీలక్ష్మి పట్టుబట్టి ఏపికి ఎందుకొచ్చినట్లు ?

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో పట్టణ పరిపాలనాభివృద్ధి శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణాలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీలక్ష్మి పట్టుబట్టి మరీ ఏపి క్యాడర్ కు తన సర్వీసును బదిలి చేయించుకుని రావటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదేమైనా నెలలపాటు పట్టువదలని విక్రమార్కునిలాగ శ్రీలక్ష్మి ఢిల్లీలోని డీవోపీటీ ఉన్నతాధికారులతో మాట్లాడుకుని చివరకు అనుకున్నది సాధించుకున్నారు.

అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగులు, అంతర్రాష్ట్ర బదిలీలు, డిప్యుటేషన్లన్నింటినీ ఢిల్లీలోని డీవోపీటీ (డిపార్ట్ మెంటు ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్)యే చూస్తుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయిన దగ్గర నుండి ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపిలో పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ తో ప్రస్తావించినపుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదే పద్దతిలో తెలంగాణా సీఎం కేసీయార్ కూడా ఆమె విజ్ఞప్తికి ఓకే చెప్పారు. కానీ డీవోపీటీ మాత్రం అంగీకరించలేదు.

తన సర్వీసును తెలంగాణా నుండి ఏపికి బదలాయించటానికి డీవోపీటీ అంగీకరించకపోయినా తనకు వీలైనంతలో వాళ్ళపై ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణలు శ్రీలక్ష్మిపై ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఈమెపైన కూడా చాలా కేసులు నమోదయ్యాయి. జగన్ పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లాంటివి కాకపోయినా నిబంధనలు ఉల్లంఘించి గనులు కేటాయించిందనే ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. విచారణలో భాగంగా ఈమెను కూడా కోర్టు చాలాకాలంపాటు జైల్లో ఉంచింది.

జైలులో ఉన్న కాలంలోనే ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేసింది. కోర్టు విచారణకు కూడా ఆమె వీల్ కుర్చీలోనే హాజరయ్యేవారు. మానసికంగా కూడా ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని సహచర ఐఏఎస్ లు చెప్పేవారు. అలాంటిది చివరకు ఆమెపై నమోదైన కేసుల్లో సరైన సాక్ష్యాలు లేవన్న కారణంగా కేసులన్నింటినీ కోర్టు కొట్టేసింది. దాంతో సస్పెన్షన్ ఎత్తేయించుకుని తెలంగాణా ప్రభుత్వంలో చేరారు.

అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్ సీఎం అయినప్పటి నుండి ఏపిలో పనిచేయాలని బాగా పట్టుదలగా ప్రయత్నించి చివరకు పట్టాణ పరిపాలనాభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. చాలా చిన్నవయస్సులోనే ఐఏఎస్ టాంపు ర్యాంకర్ గా నిలిచిన శ్రీలక్ష్మి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కేసులు, జైలు శిక్ష లాంటివి లేకపోతే చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యేవారని ఆమె సహచర ఐఏఎస్ అధికారులే అప్పట్లో చెప్పుకునే వారు. జగన్ అవినీతి మూలంగానే శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్ళారనే ఆరోపణలు చంద్రబాబునాయుడు+టీడీపీ నేతలంతా ఎన్నిసార్లు చేశారో లెక్కేలేదు. మరన్ని ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్ష్మి అదే జగన్ ప్రభుత్వంలో ఎందుకని కోరి మరీ చేరారో ఎవరికీ అర్ధం కావటం లేదు.