అరటి దొంగకు తీహార్ జైలా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కవిత జైలులో గడిపిన రోజులు, అక్కడి దుర్భర పరిస్థితులు, సరదా ఘటనల గురించి కవిత మనసు విప్పి మాట్లాడారు. అరటి పళ్ల దొంగను తీహార్ జైలుకు పంపించడం చూసి నవ్వుకున్నానని కవిత చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తీహార్ జైలు అనగానే కరుడుగట్టిన నేరగాళ్లు, రాజకీయ నాయకులు, క్రిమినల్స్, వైట్ కాలర్ కేటుగాళ్లు…వీరే గుర్తుకు వస్తారు. కానీ, తీహార్ జైలుకు అరటి పళ్ల దొంగ, పాన్ షాపు దగ్గర మాజా బాటిల్ కోసం జరిగిన చిల్లర పంచాయతీలో గొడవపడ్డ వాళ్లను కూడా ఇక్కడికి తీసుకువచ్చారని కవిత చెప్పారు.

ఆ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఇక, కొంతమంది ఐటీ యువ ఉద్యోగులు కూడా తీహార్ జైలుకు రావడం చూసి షాకయ్యానని చెప్పారు. వారు పని చేసే కంపెనీకి సంబంధించిన ఎవరో వ్యక్తి స్కాం చేస్తే…వీరిని తీహార్ జైల్లో పెట్టారని అన్నారు.

తన బ్యారెక్ ను శుభ్రం చేశారని, వీఐపీ ఖైదీగా తాను వెళ్లే సరికి జైలంతా తాను వస్తున్నట్లు టాంటాం అయిందని చెప్పారు. తనకు టీవీ ఇస్తానని చెప్పినా తాను వద్దన్నానని, తాను పెద్దగా టీవీ చూడనని అన్నారు. ఇక, జైలులో భోజనం మాత్రం ఘోరంగా ఉందని, అస్సలు తినలేకపోయానని చెప్పారు. తన పక్క సెల్లో కేజ్రీవాల్ ను పెట్టారని గుర్తు చేసుకున్నారు.