వైసీపీ హయాంలో ప్రజలతో పాటు మొక్కలు, చెట్లు కూడా స్వేచ్ఛ కోల్పోయాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అటవీ శాఖపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు, చెట్ల దుస్థితిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రహదారుల విస్తరణ పేరుతో మొక్కలను, చెట్లను తొలగిస్తున్నారని, అలా తొలగించిన వాటిని వేరే ప్రాంతంలో నాటాలని సూచించారు.
ఈ క్రమంలో కీలక చర్చను ప్రారంభించిన పవన్ కల్యాణ్ మొక్కల సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలాగా చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటి మొక్కలకు పైగా మండల స్థాయిలో నాటుతున్నామని వెల్లడించారు. పల్లె పండుగ 2.0లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో రహదారి విస్తరణలో భాగంగా భారీ వృక్షాలను కూడా నరికి వేయడం తనను కలచివేస్తోందని పవన్ అన్నారు. వాటిని తిరిగి నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
వైసీపీ హయాంలో…
ఈ సమయంలో వైసీపీ హయాంలో చెట్ల పరిస్థితిపై సభ్యులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ అప్పట్లో ముఖ్యమంత్రి పర్యటన అంటే భారీ వృక్షాలను కూల్చేశారని, పచ్చని చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేసారని అన్నారు. ఈ విషయంపై అప్పట్లో పర్యావరణ ప్రేమికులు తనకు ఫిర్యాదు కూడా చేశారని చెప్పారు. వందల సంవత్సరాల వృక్షాలను కూడా అధికారులు నరికి వేసారని, కేవలం రెండు గంటల పర్యటన కోసం ఇలా చేయడాన్ని అప్పటి ప్రభుత్వం సమర్థించుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు సీఎం అయినా, తాను అయినా ఎక్కడ పర్యటించినా అక్కడ చెట్లను నరకవద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని పవన్ తెలిపారు. అంతేకాకుండా ఇక నుంచి ఎక్కడ పర్యటించినా మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. ఇది భావితరాలకు ఆదర్శంగా మారుతుందని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను కూడా పచ్చదనంతో నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు విపత్తుల నుంచి రాష్ట్రాన్ని రక్షించే చర్యలు చేపడుతున్నామని పవన్ వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates