రప్పా రప్పా.. ఇక చాలని చెప్పు జగన్!

వైసీపీ కార్యకర్తలు అభిమానంను పేరుగా చెప్పుకుని చేస్తున్న రాద్ధాంతం అరాచకానికి దారి తీస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు రప్పా రప్పా పోస్టర్లు ప్రదర్శిస్తూ, రప్పా రప్పా నినాదాలతో హంగామా చేస్తున్నారు. అయితే దీనిని ఆపాల్సిన జగన్ కూడా వారిని చూసి ఆనందిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా ఇందులో తప్పేంటని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇది సమాజంలో జగన్‌కే మైనస్ అవుతుందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.

గత రెండు రోజులుగా జగన్ వివాహాల సందర్భంగా పర్యటనలు చేస్తున్నారు. బుధవారం ఆయన విశాఖకు వెళ్లారు. అక్కడ పార్టీ నాయకుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అయితే జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకునేలోపే కార్యకర్తలు రప్పా రప్పా పోస్టర్లతో రెడీ అయ్యారు. జగన్ రప్పా రప్పా అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, నినాదాలతో ప్రాంతం మొత్తం హోరెత్తింది. దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణ ప్రజలు మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

తాజాగా ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. దీనికి సంబంధించిన రిసెప్షన్‌ను గురువారం ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత హోదాలో జగన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఆయన రాకముందే ప్రొద్దుటూరులో ఊరు వాడా రప్పా రప్పా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. పోలీసులు కొన్నింటిని తొలగించినా కార్యకర్తలు వెంటనే మళ్లీ కట్టడం గమనార్హం.

జగన్ పర్యటన అంతా రప్పా రప్పా నినాదాలతోనే మార్మోగింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో బాధ్యతాయుత పార్టీ అధినేతగా వీటిని ఆపాల్సి ఉంది. కానీ జగన్ కూడా కార్యకర్తలకు చేయి ఊపుతూ వారిని మరింత ఉత్సాహపరిచినట్లు కనిపించింది. ఇది సహజంగానే ప్రజల్లో జగన్‌కు మైనస్ అవుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి రాజకీయాలను జగన్ సహించినా సమాజం సహించదని తటస్థ వర్గాలు కూడా అంటున్నాయి.