ఆకాశం నుంచి చూస్తే భూమంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే గుంటూరు మిర్చి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. క్రమపద్ధతిలో ఆరబోసిన మిర్చి కుప్పలు ఎర్ర తివాచీలా దర్శనం ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి.
మిర్చి క్షేత్రాల నుంచి సాగుతున్న రవాణా వ్యవస్థ, ఎర్రటి మిర్చి రాశుల మధ్య సన్నని తారు రోడ్లపై దూసుకెళ్తున్న బస్సులు, లారీలు, పక్కనే పరిగెత్తుతున్న రైలు దృశ్యాలు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ డ్రోన్ చిత్రాలు గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి.
ఈ ఎర్ర బంగారం అందాలను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి నారా లోకేష్ వీడియో మరింత వైరల్ అయింది. దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోపై స్పందిస్తూ “హోలీ పండుగ సందర్భంగా చూడదగిన అద్భుత దృశ్యం” అంటూ ప్రశంసించారు.
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చిలో గుంటూరు జిల్లాకే సుమారు 15 శాతం వాటా ఉందని పేర్కొంటూ, ఈ సీజనల్ పంటను పర్యాటక ఆకర్షణగా మలచవచ్చా? అనే ప్రశ్నను లేవనెత్తారు. స్థానిక సంగీతం, నృత్యాలతో ఉత్సవాల రూపంలో నిర్వహిస్తే రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సూచించారు.
ఈ అందాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, రైతుల జీవనోపాధికి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గుంటూరు మిర్చి ఎర్రరంగు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates