మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు అంటున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు రాజీనామా చేసినా ఆ రాజీనామాలను మోషేస్ రాజు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ మోషేస్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మండలి ఛైర్మన్ మోషేస్ రాజు తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆ ఐదుగురు అడుగులు వేస్తున్నారట.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు మోషేస్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఒకవేళ ఈ ఐదుగురు తీర్మానం పెట్టినా.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో మండలి చైర్మన్ ను మార్చడం అంత తేలికమైన విషయం కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట.