వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు ఆయన లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు.. ఏపీ ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మాజీ మంత్రితో పాటు ఆయన కుమారుడు సునీల్ పైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఎందుకు?
ఏపీలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా తరచుగా వినిపిస్తోంది. ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం నియోజకవర్గం నుంచి 2019లో విజయం దక్కించుకున్నారు. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.
అప్పట్లో రైతులను ఆయన `ఎర్రిపప్ప` అని సంబోధించడం.. పెను వివాదానికి దారితీసింది. దీనిని ఆయన సమర్థించుకున్నారు కూడా.. ఎర్రిపప్ప అంటే.. `బుజ్జి నాయన` అని అర్థమని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ కు గురయ్యారు. ఇదిలావుంటే.. మద్యం కేసులో రవాణా కాంట్రాక్టు వ్యవహారంపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు కారుమూరిని విచారించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఆయన సిట్ అదికారికి లంచం ఇచ్చి.. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారన్నది తాజాగా ఏసీబీ అధికారులు చెబుతున్నమాట. ఈ లంచం సొమ్మును.. తన కుమారుడి ద్వారా సదరు అధికారికి ఇవ్వచూపారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కారుమూరి నాగేశ్వరరావు తో పాటు ఆయన కుమారుడు సునీల్పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. “ఏపీ మద్యం సిట్ కేసు నుంచి తమను తప్పించాలంటూ… సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు“ అని పోలీసులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates