ఖమేనీ హతం.. అయినా మారని ఇరాన్ తీరు!

కరడుగట్టిన మత ఛాందసవాదిగా, అమెరికా వ్యతిరేకిగా ముద్రపడిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఈ పరిణామం అనంతరం ఇరాన్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తమకు భారమైన పాలన తొలగిపోయిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇంత జరిగినా ఇరాన్ తీరు ఏమాత్రం మారలేదు. పైగా అదే దూకుడు ప్రదర్శిస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఖమేనీ చూపించిన బాటలోనే నడుస్తామని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఇరాన్ లో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ప్రజల అసంతృప్తి మరియు ఖమేనీ మరణం కలిసి దేశంలో అనిశ్చిత పరిస్థితులను తీసుకువచ్చాయి. ప్రజాస్వామ్యం బలపడాలని స్థానికులు ఆశిస్తున్నా, ప్రభుత్వం మాత్రం కఠిన వైఖరినే కొనసాగిస్తోంది. ఖమేనీ చూపిన మార్గంలోనే ముందుకు సాగుతామని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా పతనమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు సభ్యులతో తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఈ మండలి ఇప్పటికే తన కార్యక్రమాలు ప్రారంభించినట్టు మసూద్ తెలిపారు. అమెరికా తమకు బద్ధ శత్రువని పేర్కొంటూ, శత్రు స్థావరాలు పూర్తిగా నాశనం అయ్యే వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదిలావుంటే సుప్రీం లీడర్ పదవి కోసం పలువురు పోటీలో ఉన్నారు. రెండు రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సమాచారం.

తాత్కాలికమే అయినా…

తాత్కాలికంగా అయతుల్లా అలీరేజా అరాఫీని సుప్రీం లీడర్ గా నియమించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ముగ్గురు సభ్యుల నాయకత్వ మండలితో పాటు గార్డియన్ కౌన్సిల్ లో కూడా అలీరేజా సభ్యుడిగా ఉన్నారు. ఆయనే తదుపరి సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఖమేనీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న అరాఫీ, అమెరికా వ్యతిరేక వైఖరికి ప్రసిద్ధి చెందినవారిగా చెప్పబడుతున్నారు. ఖమేనీ ప్రసంగాలు రూపొందించే బృందంలో కూడా ఆయన భాగమై ఉన్నట్టు ఇరాన్ మీడియా పేర్కొంది.

ప్రస్తుతం ఇరాన్ ఈ సంక్షోభం నుంచి త్వరగా బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పోరాట వైఖరినే కొనసాగించేలా కనిపిస్తోంది.