పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

ఎస్‌ఎంఏ టైప్–1 కారణంగా పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడుతూ కదలికలు, శ్వాసక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పునర్విక అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాడుతున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రత్యేక ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు కాగా, ప్రజలు, దాతల సహకారంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమీకరించగలిగారని వెల్లడించారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైన నిధులు సమీకరించేందుకు తన కార్యాలయం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చికిత్స ఆలస్యం కాకుండా వెంటనే ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వ, సమాజ మద్దతు అవసరమని, ఇలాంటి సందర్భాల్లో అందరూ ఒక్కటై ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. పునర్విక ఆరోగ్యం త్వరగా మెరుగుపడి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.