కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు తగలబెట్టడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
అరోరా భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకుంటానని, బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రమణా రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు.
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలోనే మహేందర్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేసి నిప్పంటించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ ఘర్షణల నేపథ్యంలోనే కామారెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ చందర్ రావు రాబోతున్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ యేలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అయితే, వారు వస్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశమున్నందున పోలీసులు వారిని అనుమతిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కామారెడ్డిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates