`గేట్స్` ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ అక్క‌సు… ఎందుకిలా?

మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు.. బిల్ గేట్స్ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. కూట‌మి ప్ర‌భుత్వంతో క‌లిసి గేట్స్ ఫౌండేష‌న్ ద్వారా.. ఏపీలో సాంకేతిక విప్ల‌వానికి స‌హ‌క‌రించేందుకు ఆయ‌న ప‌లు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం ఆయన సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంత్రివ‌ర్గాన్ని కూడా క‌లుసుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు వీక్షించారు. ఆర్టీజీఎస్‌లో కూడా క‌లియదిరిగి సాంకేతిక పాల‌న‌ను ప‌రిశీలించారు.

ఇదంతా ఎవ‌రి కోసమో కాదు.. సీఎం చంద్ర‌బాబు చొర‌వ‌తో గేట్స్ ఏపీ అభివృద్ధి కోసం వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని వెనుక ఎలాంటి లాలూచీ లేదు. వ్యాపార సంబంధ‌మైన వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా లేవు.

ఈ ప్ర‌య‌త్నం ద్వారా ఏపీకి, ప్ర‌జ‌ల‌కు కూడా మంచి చేయాల‌న్న స‌దుద్దేశ‌మే ప్ర‌భుత్వానికి ఉంది. అయినా.. ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోయారు. గేట్స్ ప‌ర్య‌ట‌న‌ను కూడా వివాదం చేసేందుకు ప్ర‌జ‌ల్లో విద్వేషం నింపేందుకు ప్ర‌య‌త్నించార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

ఏం చేశారంటే..

సోష‌ల్ మీడియాలో గేట్స్ వ్య‌క్తిగ‌త అంశాలు జోరుగా హ‌ల్చ‌ల్ చేశాయి. యూట్యూబ్ నుంచి ఫేస్‌బుక్‌, ఇన్ స్టా వ‌ర‌కు.. గేట్స్ వ్య‌క్తిగ‌త విష‌యాలు.. ఆయ‌న భార్య చేసిన విమ‌ర్శ‌లు.. అమెరికాకు చెందిన లైంగిక ఉగ్ర‌వాదిగా పేరుబ‌డ్డ‌ ఎప్‌స్టీన్(జైల్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు) ఫైల్స్‌లోని కొన్ని అంశాల‌ను ప్ర‌చారం చేశారు. గేట్స్‌కు సుఖ వ్యాధులు ఉన్నాయ‌ని.. వాటికి ఆయ‌న వైద్యం చేయించుకుంటున్నార‌ని.. ఈయ‌న‌తో క‌లిసి.. రాష్ట్రంలో సుఖ వ్యాధుల నిర్మూల‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంటోంద‌ని ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించిన టీడీపీ నాయ‌కులు.. ఇదంతా వైసీపీ ప‌నేన‌ని.. గేట్స్ వంటి బిలియ‌నీర్ రాష్ట్రానికి వ‌స్తే.. ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేంది? అంటూ.. మండి ప‌డుతున్నారు. “మీకు ఎలానూ చేత‌కాదు.. చంద్ర‌బాబు చేస్తుంటే ఓర్చుకోలేక‌పోతున్నారు“ అంటూ..ప‌లువురు టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు.