ఏబీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సస్పెన్షన్ లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా తనకున్న అధికారాలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ ప్రజాప్రతినిధులను, నేతలను ఇబ్బందులు పెట్టడానికే ఉపయోగించారనే ఆరోపణలు వినబడ్డాయి. అంతటి అదికారాలతో చెలరేగిపోయిన ఏబీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుండి కష్టాల్లో పడిపోయారు.

టీడీపీ హయాంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన అత్యంతాధునిక కమ్యూనికేషన్ సాంకేతిక పరికరాలను, టెలిఫోన్ భద్రతా పరకరాల కొనుగోలు కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఇజ్రాయెల్ కంపెనీ నుండి రూ. 25 కోట్లకు అవసరమైన పరికరాలను కొనుగోలో చేసింది ప్రభుత్వం. అయితే కొనుగోలు మొత్తం తన కొడుకు కంపెనీ నుండే కొనుగోలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రాధామిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ నిజాలే అని నిర్ధారణయ్యాయి. దాంతో ప్రభుత్వం ఏబీని సస్పెండ్ చేసింది.

తన సస్పెన్షకు వ్యతిరేకంగా క్యాట్ ను ఆశ్రయించిన ఏబీకి చుక్కెదురైంది. తర్వాత హైకోర్టుకెళ్ళి సస్పెన్షన్ ను ఎత్తేయించుకున్నారు. తర్వాత ప్రభుత్వం సుప్రింకోర్టుకెళితే సస్పెన్షన్ కరెక్టే అని ధృవీకరించింది. దాంతో అప్పటి నుండి ఏబీ సస్పెన్షన్లోనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఏబీకి నోటీసు అందింది. ఆయనపై ప్రభుత్వ పరంగా క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటే సమాధానం చెప్పటానికి 15 రోజుల గడువిచ్చింది. 15 రోజుల్లోగా సమాధానం రాకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.

ప్రభుత్వ నోటీసు ద్వారా ఏబీపై చర్యలు తప్పవని అర్ధమైపోయింది. ఐపీఎస్ అధికారి హోదాలో తన పరిధిదాటి వ్యవహరించినందుకే ప్రస్తుతం ఏబీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు తమ ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టేందుకు అధికారయంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం మామూలే. కానీ అధికారపార్టీ చెప్పినట్టల్లా వినాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాల్సింది ఉన్నతాధికారులే. అధికారపార్టీతో కలిసిపోయి ప్రత్యర్ధి పార్టీలను ఇబ్బందులు పెట్టాలని అనుకుంటే ఇపుడు ఏబీ పడుతున్న అవస్తలు తప్పవని మరోసారి నిరూపణైంది.