బంగ్లాదేశ్‌ కొత్త ప్రధాని.. భారత్‌కు ప్లస్సా? మైనస్సా?

బంగ్లాదేశ్ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా షేక్ హసీనా హవా నడిచింది. ఆమె భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా ఉండేవారు. కానీ ఇటీవలి హింసాత్మక గొడవలతో ఆమె దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రెహమాన్, తన బిఎన్‌పి పార్టీతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మార్పు ఇరు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజానికి బంగ్లాదేశ్‌లో రెండు ప్రధాన రాజకీయ ధృవాలు ఉన్నాయి. ఒకటి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, ఇది మొదటి నుంచి భారత్‌కు మద్దతుగా ఉంటుంది. రెండోది తారిక్ రెహమాన్ పార్టీ అయిన బిఎన్‌పి. గతంలో ఈ బిఎన్‌పి పార్టీ ‘జమాతే ఇస్లామీ’ అనే ఒక మతపరమైన ఇస్లామిక్ సంస్థతో కలిసి పని చేసేది. ఈ జమాతే ఇస్లామీకి పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందనే ఆరోపణలు ఉండటంతో.. గతంలో బిఎన్‌పి అధికారంలో ఉన్నప్పుడు భారత్ బంగ్లా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి.

అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఈ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ ఆ వివాదాస్పద జమాతే ఇస్లామీతో సంబంధం లేకుండా సొంతంగా మెజారిటీ సాధించారు. అంటే ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయాల్లో ఇతర మతపరమైన సంస్థల ఒత్తిడి ఉండకపోవచ్చు. దీనివల్ల భారత్ కు కలిసొచ్చే అంశమే. ఒకవేళ ఆయన ఆ కట్టర్ సంస్థలతో కలిసి వచ్చి ఉంటే, బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్థాన్, చైనాలకు దగ్గరయ్యే ప్రమాదం ఉండేది. తారిక్ రెహమాన్ కూడా భారత్ ప్రయోజనాలను కాపాడతానని హామీ ఇవ్వడం ఒక సానుకూల పరిణామం.

అయినప్పటికీ భారత్ ముందు కొన్ని సవాళ్లు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్, బంగ్లాదేశ్‌లో ఉన్న హిందూ మైనారిటీల భద్రత. హసీనా నిష్క్రమణ తర్వాత అక్కడ హిందువులపై దాడులు పెరిగాయనే వార్తలు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఈ విషయంలో తన నిరసనను గట్టిగా వినిపించింది. తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఈ సమస్యలను ఎంత చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందనే దానిపైనే ఇరు దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

వ్యాపారపరంగా చూస్తే, రెండు దేశాలూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచి వచ్చే ముడి పత్తి అత్యంత కీలకం. అంటే రాజకీయంగా విభేదించినా, ఆర్థికంగా కలిసి ఉండటం ఇద్దరికీ అవసరం. ప్రస్తుతానికి ఢిల్లీ ప్రభుత్వం తారిక్ రెహమాన్‌కు స్నేహహస్తం అందించింది. మరి ఈ కొత్త స్నేహం బంగ్లాదేశ్‌ను చైనా, పాకిస్థాన్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.