ఇవేం మాటలు మల్లన్నా?

చింతపండు నవీన్…అలియాస్ తీన్మార్ మల్లన్న..తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన నవీన్…ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫక్తు పొలిటిషన్ గా మారిపోయారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మల్లన్న ఎక్కువ పాపులర్ అయ్యారు.

బీజేపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారి చివరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అని సొంతంగా పార్టీ పెట్టారు. బీసీలకు రాజ్యాధికారం కావాలి అన్న నినాదంతో ఈ పార్టీ పెట్టారు మల్లన్న. ఈ నేపథ్యంలోనే టీఆర్పీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో మల్లన్న చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి.

ఆ సభలో రెడ్లు, వెలమలు ఎవరైనా ఉంటే దయచేసి బయటకు వెళ్లాలని మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు మాత్రమే ఈ సభలో ఉండాలని మల్లన్న హుకుం జారీ చేశారు.

ఇది తమ సభ అని, తమ సోదరులు మాత్రమే ఉండాలని మల్లన్న చేసిన కులపరమైన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో, మల్లన్నపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

మొన్నటివరకు మున్నూరు కాపు అంటూ కాపు సంఘాల ఐక్యత కోసం సభలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన మల్లన్న సడెన్ గా బీసీగా ఎలా మారిపోయాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అని, మరి అప్పుడు ఈ కుల రాజకీయాలు, బీసీ కార్డు గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కుల రాజకీయాలకు మల్లన్న ఆద్యం పోస్తున్నాడని విమర్శిస్తున్నారు.