‘బీజేపీ లేక‌పోతే.. కూట‌మి లేదు’

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న చ‌డిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. బీజేపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

తాజాగా ఆయన తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి నుంచి ప్రారంభించి.. కూట‌మి పార్టీల వ‌ర‌కు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా బీజేపీ రాష్ట్ర సార‌థి పీవీఎన్ మాధ‌వ్ స‌మ‌క్షంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్య‌లు.. కూట‌మిలో మంట‌లు రేపే ప‌రిస్థితి ఉంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కూట‌మి పాల‌న ఎలా ఉందో.. అంద‌రికీ తెలిసిందేన‌న్న ఆది నారాయ‌ణ రెడ్డి.. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పాలన ఎలాఉంది అని అడిగితే… `కమ్మ`గా ఉందని గజ్జెల మల్లారెడ్డి చెప్పేవాడు…! ఇప్పటికీ అలాగే `కమ్మ`గానే ఉంది… ఆ పరిస్థితి పోవాల అన్నారు.

అంతేకాదు.. క‌మ్మ‌గా ఉంది.. అంటే అర్థ‌మైందిగా! అంటూ.. అంద‌రినీ ప్ర‌శ్నించారు. కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, కానీ.. కూట‌మిలోను ప్ర‌భుత్వంలోనూ అన్ని సామాజిక వ‌ర్గాల వారు ఉన్నార‌ని తెలిపారు. కానీ, ఎక్క‌డ కూడా క‌మ్మ‌ల‌కే ప్రాధాన్యం పెరిగింద‌న్నారు.

ఇక‌, తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడుతూ.. లడ్డూ సంఘటనలో తప్పు చేసి వాళ్ళదే పైచేయి అయింది.. ముందు వైసీపి వాళ్ళ కొవ్వు కరగదీయాల.. అలా కరగదీస్తే తప్ప కూటమి బాగుపడదు. అని వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ స‌మ‌యంలో ఆయ‌న మ‌హిళ‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. “అన్ వాంటెడ్‌గా ఓ గ‌దిలో మ‌హిళ‌లు దొరికిపోతే.. వారు త‌మ‌ను తాము ప‌తివ్ర‌త‌లుగా.. సీత‌మ్మ‌లుగా చెప్పుకొంటే చ‌లామ‌ణి అవుతదా. కానీ, వైసీపీ మాత్రం అలానే వ్య‌వ‌హ‌రిస్తోంది.“ అన్నారు.

ఇక‌, కూట‌మిపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ లేనిదే టీడీపీ, జనసేన… లేవని అన్నారు. బీజేపీ ఉండ‌బ‌ట్టే రాష్ట్రంలో కూట‌మి ముందుకు సాగుతోంద‌న్నారు. పొరుగున ఉన్న త‌మిళ‌నాడు, తెలంగాణ‌కు కూడా కేటాయింపులు లేవ‌ని.. కానీ, ఏపీకి మాత్రం భారీగా కేటాయింపులు జ‌రిగాయ‌న్నారు. కానీ, బీజేపీకి ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్నారు. దీనిని అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఎదుర్కొనాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ్యాఖ్యానించారు.