ఇన్ సైడర్ ట్రేడింగ్ ప్రూవ్ చెయ్ జగన్ రెడ్డీ… చంద్రబాబు సవాల్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రైతులంతా తమ పంట పొలాలను త్యాగం చేసిన సంగతి తెలిసిందే. తమ భావితరాల భవిష్యత్తు కోసం 33 వేల ఎకరాల భూమిని రైతులు నాటి సీఎం చంద్రబాబు పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. తమ ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మితమవుతోందని గర్వంగా చెప్పుకున్న రైతులకు ఆ సంతోషం కొద్ది రోజులు కూడా మిగలలేదు.

2019లో సీఎం జగన్ అధికారంలోకి రావడంతో అమరావతి రైతుల కలలు కల్లలయ్యాయి. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంచుతామంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని రైతుల గుండెల్లో ఆరని మంటలు రేపింది. తమ త్యాగం వృథాగా పోతుండడంతో అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఒక రాష్ట్రం-ఒక రాజధాని అన్న నినాదంతో అమరావతి రైతులు ఉద్యమం చేపట్టారు.

అనతి కాలంలోనే అమరావతి రైతుల ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు రావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ క్రమంలలోనే అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ స్థాయిలో ‘జనభేరి’ సభను నిర్వహించారు. ఈ జనభేరి సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొని…సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. అమరావతి భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ప్రూవ్ చెయ్ గలవా జగన్ రెడ్డీ… అని చంద్రబాబు సవాల్ విసిరారు. సీఎం జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని…ఇష్టముంటే ముద్దులు…లేకపోతే పిడిగుద్దులు అనేది ఆయన నినాదమని ఎద్దేవా చేశారు.

అమరావతి రాజధాని కోసం ఏడాదిగా అమరావతి రైతులు, మహిళలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వారందరూ విప్లవ వీరులని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచే త్యాగధనుని, అమరవీరులని కొనియాడారు. ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం జరుగుతున్న ఏకైక ఉద్యమం ఇదేనని, ఈ తరహా ఉద్యమం నభూతో న భవిష్యత్ అని అన్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలు రియల్ ఎస్టేట్ మహిళలు, వ్యాపారులను జగన్ అంటున్నారని, సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏమిటని మండిపడ్డారు. ప్రజల రక్తం తాగే జగన్ మోహన్ రెడ్డే వ్యాపారస్తుడని దుయ్యబట్టారు. అమరావతి రైతులకు కులం ఆపాదిస్తున్నారని, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతున్నవారిలో అన్ని కులాల వారు ఉన్నారని, వారికి సంఘీభావంగా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా వచ్చారని అన్నారు. రైతుల గురించి జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుని జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇవాళ నేను ఉదయం ఇక్కడికి వచ్చేముందు కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నా. ఎందుకంటే… బెజవాడ కనకదుర్గమ్మ మూడో కన్ను తెరిచి ఈ రాక్షసులను అంతుతేల్చి అమరావతికి విముక్తి కలిగిస్తుందని చంద్రబాబు ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఉద్ధండరాయునిపాలెంలో పవిత్ర మట్టి, జలాలతో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం చూస్తే కడుపు తరుక్కుపోయిందన్నారు. రాజధానికి 30 వేల ఎకరాలైనా ఉండాలని గతంలో జగన్ అన్నారని, ఆ మాట ఒప్పుకొని తాను ఫేక్ సీఎం కాదని జగన్ నిరూపించుకోవాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమి ఇస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి జగన్ కు నోరు ఎలా వచ్చిందని మండిపడ్డారు. 19 నెలల పాలనలో ఏం సాధించావని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు.