ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి కల్యాణ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ నుంచి ఇతర నాయకుల వరకు కూడా పవన్ను టార్గెట్గా చేసుకుని దూకుడు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం.. తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసేందుకు రెడీ కావడమేనని తెలుస్తోంది.
ఈ నెల 11న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వాస్తవానికి జనసేన నేరుగా తలపడాలని నిర్ణయించుకుంది. కొత్త కమిటీలను వేసి.. పార్టీ పరంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకునే బాధ్యతలను నాయకులకు అప్పగించింది. అయితే.. ఆ సమయంలో పవన్పై ఎవరూ కామెంట్లు చేయలేదు. పైగా ఒకరిద్దరు నాయకులు ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు అభ్యంతరం లేదన్నారు.
ఇదే సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేనల మధ్య ఒక అవగాహనకుదిరింది. దీని ప్రకారం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో ఆయన తెలంగాణలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ భగ్గు మనడానికి రీజన్గా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నుంచి ఇతర నాయకుల వరకు కూడా.. జనసేనను టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు తెరమీదికి తీసుకువస్తున్నారు. “పవన్ కల్యాణ్ను పవన్ కాదు.. దిష్టికల్యాణ్“ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ బీజేపీ భిక్షాం దేహీ అని పవన్ ముందు మోకరిల్లిందని.. ఎద్దేవా చేశారు. అంతేకాదు.. పవన్ కేవలం ఏపీ నాయకుడని, ఆయన గతంలో తెలంగాణ భాష, యాస గురించి నీచంగా మాట్లాడారని.. కూడా నాయకులు గుర్తు చేయడం గమనార్హం.
బుధవారం మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయగా.. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే రేంజ్లో జనసేనపై విమర్శలు గుప్పించారు. అయితే.. కాంగ్రెస్ చేస్తున్న ఈ విమర్శలను జనసేన నాయకులు అదే రీతిగా ఖండిస్తున్నారు. జనసేన పార్టీ ఏపీది మాత్రమే కాదని.. అది జాతీయ సమగ్రత కోసం జనించిన పార్టీగా చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి.
మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్
Gulte Telugu Telugu Political and Movie News Updates