ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు.. తేడా కొడుతున్నాయి. నాస్తిక‌త్వం-స‌నాత‌న ధ‌ర్మంపై నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. ఆయ‌న డ్యూయ‌ల్ మ‌న‌స్త‌త్వానికి అద్దం ప‌డుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. గ‌తంలో అంత బ‌లంగా తాను నాస్తికుడిన‌ని.. చెప్పిన నాగ‌బాబు తాజాగా తాను స‌నాత‌న హిందువున‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌నను ట్రోల్ చేసేలా చేశాయి.

గ‌తంలో..

గ‌తంలో ఓ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ‌బాబు స్పందిస్తూ.. తాను దేవుడిని న‌మ్మ‌బోన‌ని అన్నారు. దేవుడు లేడ‌ని ప‌క్కాగా నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. అంతేకాదు.. గ‌తంలో తాను ఉంగ‌రాలు పెట్టుకుని, యజ్ఞ‌యాగాదులు కూడా చేసేవాడిన‌ని.. మ‌హా భార‌తం, రామాయ‌ణం, వేదాలు వంటి వాటిని కూడా చ‌దివాన‌ని అన్నారు.

కానీ, ఏడెనిమిదేళ్ల కింద‌ట నుంచి తాను దేవుడిని న‌మ్మ‌డం లేద‌న్నారు. అయితే.. తాను ఈ విష‌యంలో ఎవ‌రినీ విమ‌ర్శించ‌న‌న్నారు. ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయ‌ని.. ఎవ‌రి విశ్వాసాలు వారివ‌ని తెలిపారు. బ‌హిరంగంగా ఎవ‌రినీ తాను విమ‌ర్శించ‌లేద‌న్నారు. అయితే.. దేవుడు లేక‌పోయినా.. తాను మాన‌వ‌త్వాన్ని విశ్వ‌సిస్తాన‌న్నారు.

తాజాగా..

తాజాగా బుధ‌వారం విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియోలో నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను స‌నాత‌న హిందువున‌ని అన్నారు. అయితే.. తాను గ‌తంలో చేసిన నాస్తిక వాద వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. “మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. గ‌తంలో నేను నాస్తికుడిన‌ని అన్నాను. కానీ, నేను స‌నాత‌న హిందువును. హిందూత్వం అంటే మ‌తం కాదు. అది ధ‌ర్మం.“ అని కొత్త భాష్యం చెప్పారు.

ఈ సంద‌ర్భంగానే వైసీపీ హ‌యాంలో ప‌లు ఆల‌యాల‌పై జ‌రిగిన దాడుల‌ను ప్ర‌స్తావిస్తూ.. రామో విగ్ర‌హ‌వాన్ ధ‌ర్మ‌.. అని రామాయ‌ణంలో మారీచుడు చెప్పాడ‌ని ఉద‌హ‌రించారు. వైసీపీ హ‌యాంలో ఆల‌య వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని విమ‌ర్శించారు.

ఇలా.. గ‌తంలో నాస్తిక‌త్వం.. ప్ర‌స్తుతం స‌నాత‌నం అంటూ.. నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారు? అనేది చూడాలి.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం భారీ ఎత్తున రాజ‌కీయంగా మార‌డంతో త‌న పార్టీనాయ‌కులు మౌనంగా ఉండ‌డంప‌ట్ల జ‌న‌సేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా నాగ‌బాబుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలోనే నాగ‌బాబు.. బుధ‌వారం స‌నాత‌నంపై సెల్ఫీ వీడియో చేశారు. ఇక‌, తిరుమ‌ల ల‌డ్డూపైనా తాను మాట్లాడ‌తాన‌ని అన్నారు. మ‌రి ఇప్పుడు వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న త‌న సెల్ఫీ వీడియోల‌ను కొన‌సాగిస్తారో లేదో చూడాలి.