‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా అనిల్ కుమార్ యాదవ్ పాల్గొనలేదు.

అయితే, తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై దాడి నేపథ్యంలో అనిల్ కుమార్ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే పాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చారు. వైసీపీ హయాంలో ఇష్టారీతిన మాట్లాడిన మాదిరిగానే అనిల్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.

లడ్డూ ఇష్యూలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్లో ఉన్నారని, దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన బెట్టి సవాలు విసరాలని అనిల్ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. ఈ కేసులు, అరెస్టులు పక్కనబెట్టి వైసీపీ, టీడీపీ తేల్చుకుందామా అంటే దానికి సిద్ధమని సవాల్ విసిరారు.

తెగిస్తే ఎవరికి ఎవరు ఏమీ కారని, కానీ, అది మంచి రాజకీయం కాదని అన్నారు. ఐదేళ్లలో జగన్ ఈ తరహా రాజకీయాలు చేయలేదని చెప్పారు. ఈ తరహాలో రాజారెడ్డి రాజ్యాంగం, రాయలసీమ ఫ్యాక్షన్ చూపించి ఉంటే నిజంగా మీరు బయట తిరిగేవారా అని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ప్రశ్నించారు.

కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయంమని, లడ్డు దుష్ప్రచారంలో కూటమి నాయకులు దొరికి పోయారని ఆరోపించారు. ఆ ఇష్యూ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మరో మూడేళ్లు ఈ ఆటవిక పాలన భరిస్తామని, 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలపై దాడులతో కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని, రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.