బర్త్ డే స్పెషల్: జగన్ కు తోడుగా నీడగా.. షర్మిల..

ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల శాతం పొంది.. 2019 ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సీఎం జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనను నడిపించింది ఎవరు? ఆయన వెనుకున్నది ఎవరు అన్నది తరిచిచూస్తే ఆయన కుటుంబమే కనిపిస్తుంది. సీఎం జగన్ వెనుక స్త్రీ శక్తి స్వరూపాలున్నాయి. వాళ్లు ఎవరు? ఆ శక్తి ఎమిటో చూద్దాం..

స్త్రీ శక్తి స్వరూపం, స్త్రీ స్పష్టికి మూలం, స్త్రీ జన్మ అపురూపం, పరమశివునిలో అర్థభాగం స్త్రీ, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనే మాట తరచుగా అంటారు. సీఎం జగన్ విజయం వెనుక ముగ్గురు స్త్రీలు ఉన్నారు. జగన్ సీఎం కావడం వెనుక ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ, సతీమణి భారతి పాత్ర ఎంతో ఉందని అందరికి తెలిసిన విషయమే. 2014 ఎన్నికల్లో 67 సీట్ల గెలిచిన జగన్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని కష్టాలు అనుభవించి ఇప్పుడు సీఎంగా విజయతీరాలకు చేరడం వెనుక ఆ వెనుకున్నది ఆ ముగ్గురే కావడం విశేషం.

జగన్ సంతోషాల్లో… బాధల్లో ఆయన తల్లి, చెల్లి, సతీమణి అండగా ఉన్నారు. అందరికంటే ఎక్కువగా జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి.. పార్టీని చెదిరిపోకుండా నిలబెట్టి.. పాదయాత్రతో ప్రజలకు చేరువై వైసీపీకి నేనున్నానంటూ జగన్ చెల్లెలు షర్మిల ముందు నిలిచారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేసి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేశారు. వైఎస్ జగన్ ను కుట్రపన్ని ప్రత్యర్థులు జైల్లో ఇరికించిన వేళ పార్టీకి అన్నీ తానై షర్మిల వ్యవహరించారు. అన్నకు తగ్గ చెల్లిగా.. జగన్ ‘వదిలిన బాణం’గా షర్మిల నిలిచింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. పార్టీని బతికించింది. పార్టీ కోసం జగన్ లేనప్పుడు ప్రచార బాధ్యతను, పార్టీని నడిపించింది షర్మిలే.. షర్మిల మాటలు తూటాల్లా పేలాయి. 2019 ఎన్నికల్లో ‘బైబై బాబు’ అన్న షర్మిల పిలుపుకు విశేష స్పందన వచ్చింది.

షర్మిల ప్రచారంలో లోకేష్ ను, చంద్రబాబును చెడుగుడు ఆడిన తీరును ఇప్పటికీ మరిచిపోరు. లోకేష్ బాబును ‘పప్పు’ అన్న షర్మిల మాటలు నాడు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ ప్రచారానికి గొప్ప ఊపును.. పంచ్ డైలాగులను అద్దింది.. ప్రచారంలో పాపులర్ చేసింది షర్మిలనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

2012లో జగన్ అరెస్టు అయ్యారు. దీంతో నాడు వచ్చిన ఉప ఎన్నిక ప్రచారానికై పార్టీ అభ్యర్థి కొండ సురేఖ తరుపున షర్మిల ప్రచారంలో పాల్గొని సత్తా చాటారు.. పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి పార్టీ బలోపేతం చేయడానికి మరో ‘ప్రజా ప్రస్థానం’ పేరు మీద పాదయాత్రను 18 అక్టొబరు 2012న ప్రారంభించారు. ఈ పాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగింది. యాత్ర దూరం 3000 కి.మీ. తన పాదయాత్రను, తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ) నుంచి షర్మిల ప్రారంభించడం విశేషం..

ఇప్పుడు వచ్చిన వైసీపీ గెలుపు గాలివాటం కాదు.. అందులో జగన్ కష్టం ఉంది. ఆయన పడిన శ్రమ ఉంది. అన్న జగన్ లేనప్పుడు పార్టీని బతికించిన చెల్లెలు షర్మిల మనోధైర్యం ఉంది. అందుకే అన్నకు తగ్గ చెల్లెలుగా షర్మిల ఇప్పుడు వైసీపీ విజయంలోనూ ఓ తూరుపుముక్క.. అన్న గెలుపులో ఒక అలుపెరగని యోధురాలు షర్మిల అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘షర్మిల బర్త్ డే’’ సందర్భంగా ఆమె చేసిన త్యాగాలను.. ఆమె పార్టీ కోసం పాటుపడిన జ్ఞాపకాలను వైసీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. షర్మిలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.