వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసిందని చార్జిషీట్ లోని 35వ పేజీలో స్పష్టం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అది మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగిస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి నేతలు అపచారానికి పాల్పడ్డారని, అందు కోసం రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని గోరంట్లలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆ తర్వాత రాడ్లు, కర్రలతో రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. అంబటి ఆ ఫ్లెక్సీ ఎలా చించుతాడో చూస్తాం అంటూ…అంబటి కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి ఫైర్ అయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఆ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో అంబటి దూషించారు.
రమ్మను చంద్రబాబును చూసుకుందాం…అంటూ రాయడానికి వీలు లేని భాషతో బూతులతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా…వాడు వీడు అంటూ బూతుపురాణం చదివారు అంబటి. దీంతో, అంబటిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates