మంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై సోషల్ మీడియాలో గుసగుసలు…ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఈ టాపిక్ లపై హాట్ డిబేట్ లు నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో భట్టి విక్రమార్క నివాసంలో ఓ రహస్య భేటీ జరిగిందని పుకార్లు పుట్టాయి. భట్టి ఇంట్లో నలుగురు మంత్రులు రహస్యంగా 3 గంటల పాటు భేటీ అయ్యారని ప్రచారం జరిగింది.

రేవంత్ రెడ్డి బాధిత మంత్రులంతా ఒక్కతాటిపైకి వచ్చారని, రేవంత్ పై కాంగ్రెస్ హై కమాండ్ కు కంప్లయింట్ చేసేందుకు రెడీ అయ్యారని ఊహాగానాలు వచ్చాయి. భట్టి ఇంటికి ఒకే కారులో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారని, మీడియాలో తమపై వస్తున్న వ్యతిరేక కథనాల వెనుక రేవంత్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే ఆ భేటీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం అందుబాటులో లేకుంటే మంత్రులు భేటీ అయి పలు విషయాలపై చర్చించడం సాధారణ విషయమన్నారు. దానిపై అనవసరమైన రాద్దాంతం అవసరం లేదని చెప్పారు.

ఈ భేటీపై కొందరు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనాపరమైన అంశాలు, మున్సిపల్‌ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామని, దాపరికం ఏమీ లేదని అన్నారు. ఇక, రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రులు సమావేశం కావడంలో తప్పేం లేదని తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.