ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దుబాయ్‌ల మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై ఇరువురు చర్చించారు.

ముఖ్యంగా ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని చంద్రబాబు చేసిన సూచనలను అల్ మార్రీ స్వాగతించారు. ఆహార తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ దేశానికి చెందిన 40కి పైగా కంపెనీలు ఏపీలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని, వాటిని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు.

ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు దుబాయ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్‌కు ఏపీ కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో సెమీకండక్టర్ రంగానికి కూడా ప్రధాన వేదిక అవుతుందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

నైపుణ్యం కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని సమర్థంగా వినియోగించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి సింగిల్ విండో విధానంలో నేరుగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. భూములు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

దీనిపై సంతోషం వ్యక్తం చేసిన దుబాయ్ ఆర్థిక మంత్రి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశారు.