ఇక కూటమిలోకి వారు ఎంట్రీ ఇవ్వొచ్చు

పార్టీలు ఏవైనా.. నాయ‌కులు ఎవ‌రైనా వివాద ర‌హితులుగా ఉన్నారా? వారిపై ఎలాంటి మ‌చ్చ‌లు లేవా? అయితే.. ఇదే ప్రామాణికంగా.. జ‌న‌సేన‌, టీడీపీలు నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాల‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా ఉంది. అయితే.. ఈ క్ర‌మంలో కేవ‌లం పాల‌న‌ప‌రంగానే కాకుండా.. రాజ‌కీయ ప‌రంగా కూడా.. ఇరు పార్టీలు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. కొన్నాళ్ల కింద‌ట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇదే విష‌యం చెప్పారు.

“వైసీపీని అధికారంలోకి రాకుండా చేస్తాం. దీనికి ఎన్ని ఎత్తులు వేయాలో.. ఎన్ని వ్యూహాలు వేయాలో అన్నీ వేస్తాం“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చారు. అయితే.. ఎన్నిక‌ల నాటికి క‌దా.. ఈ వ్యూహాలు అనుకున్న‌వారు ఉన్నారు. కానీ, ఇప్ప‌టి నుంచే జ‌న‌సేన వ్యూహాత్మ కంగా అడుగులు వేయ‌డం ప్రారంభిస్తోంది. దీనికి టీడీపీ కూడా క‌లిసి వ‌స్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశం అనంత‌రం.. టీడీపీ-జ‌న‌సేన అధినేత‌లు ఈ విష‌యంపై దృష్టి పెట్టారు.

సుదీర్ఘ ప్ర‌యాణాన్ని.. పాల‌న‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్పుడు.. దానికి అనుగుణంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగానే.. జ‌న‌సేన‌, టీడీపీలు వివాద ర‌హిత నాయ‌కుల‌కు వీర‌తాళ్లు వేసేందుకు రెడీ అవుతున్నాయి.

ప్రాంతాలు.. నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా.. వైసీపీని డైల్యూట్ చేయ‌గ‌లిగే వ్యూహాలకు ప‌దును పెంచుతున్నాయి. దీనిలో భాగంగానే నాయ‌కుల‌ను చేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది వ‌ర్కవుట్ అయితే.. వైసీపీ నుంచే కాకుండా.. త‌ట‌స్థ నేత‌లుగా ఉన్న‌వారిని కూడా పార్టీలో చేర్చుకునే అవ‌కాశం ఉంటుంది.

మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అనుస‌రించే వ్యూహాల‌ను మూడేళ్ల ముందుగానే ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌న్న ల‌క్ష్యంతో టీడీపీ, జ‌న‌సేన ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌న్న‌ది ఇరు పార్టీల్లోనూ జ‌రుగుతున్న చ‌ర్చ. గ‌త వైసీపీ హ‌యాంలో కొంద‌రు నాయ‌కులు వివాదాల‌కు కేంద్రంగా మారారు. మ‌రికొంద‌రు పార్టీలోనే ఉన్నా.. వివాద‌ర‌హితులుగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారిని ఇప్పుడు.. త‌మ వైపు తీసుకోవ‌డం ద్వారా వైసీపీని సాధ్య‌మైనంత వ‌ర‌కు.. డైల్యూట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి ఎంత మందిని చేర్చుకుంటారో చూడాలి.