‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. వేరే ప‌నులు కూడా పెట్టుకోరు. కానీ, ఏపీ సీఎం చంద్ర బాబు స్ట‌యిల్ మాత్రం వేరు.

పండ‌గ పండ‌గే.. ప‌నులు ప‌నులే అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న సొంత గ్రామం నారా వారిప‌ల్లెకు కుటుంబ స‌మేతంగా చంద్ర‌బాబు వెళ్లారు. ఇదేస‌మ‌యంలో నంద‌మూరి ఫ్యామిలీ కూడా అక్క‌డ‌కు చేరుకుంది.

అయితే.. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మూడు రోజుల‌పాటు.. అక్క‌డే ఉండ‌నున్నారు. సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించే భోగి మంట‌లు.. సంక్రాంతి వేడుక‌ల‌కు ఆయ‌న స‌మ‌యం కేటాయించారు. కానీ, అనూహ్యంగా త‌న షెడ్యూల్‌ను త‌నే మార్చుకున్నారు చంద్ర‌బాబు.

భోగికి ముందు రోజు స్థానికంగా ఉన్న మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. చిన్నారుల‌తో క‌లిసి.. త‌న మ‌న‌వ‌డు.. దేవాన్ష్ చేసిన సంద‌డిని.. ఆడిన ఆట‌ల‌ను కూడా ఆయన ఆస‌క్తిగా వీక్షించారు.

దీంతో నారా వారి ఫ్యామిలీ అంతా మురిసిపోయింది. చాలా రోజుల త‌ర్వాత‌..త‌మ‌కు చంద్ర‌బాబు స‌మయం ఇచ్చార‌ని అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే చంద్ర‌బాబు అక్క‌డ నుంచి ఎమ్మెల్యే పులివ‌ర్తి నానీతో క‌లిసి చంద్ర‌గిరి మండ‌లం.. మూల‌ప‌ల్లెవ‌ద్ద‌కు వెళ్లారు.

అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కృష్ణా న‌ది నీటిని చంద్ర‌గిరి మండ‌లానికి.. అటు నుంచి తిరుప‌తికి మ‌ళ్లించే ప‌నుల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు గంట‌ల‌కుపైగానే ఆ ప‌నుల్లో బిజీగా గ‌డిపారు.

ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మేడం సీఎంగారు వేరే చోట‌కు వెళ్లిపోయారు.. అని మీడియా మిత్రులు అన‌గానే.. “అవును. నాకు తెలుసు. ఆయ‌న ప‌నిరాక్ష‌సుడు. ఒక్క రోజు కూడా మాతో ఉండ‌రు.

గ‌తంలోనే(ప్ర‌తిప‌క్షం) లేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇంకా ఏముంటారు. ఆయ‌న‌కు ప‌ని.. ప్ర‌జ‌లు ఇవే కావాలి.“ అని నిట్టూర్చారు. అయితే.. ఇదంతా ఆఫ్‌ది రికార్డే. ఎక్క‌డా బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ, పండ‌గ రోజు కూడా ప‌నులు పెట్టుకోవ‌డం మాత్రం నారా కుటుంబాన్ని ఒకింత ఇబ్బంది పెట్టింద‌నే చెప్పాలి.