పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. మాన‌వ‌త్వానికి వైద్యం చిరునామా అని పేర్కొన్న ఆయ‌న‌.. నెల‌లో ఒక్క‌రోజైనా గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లకు ఆధునిక వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాల‌ని కోరారు.

పిఠాపురంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కాకినాడ లోని ప్ర‌ఖ్యాత రంగరాయ మెడిక‌ల్ కాలేజీలో నూత‌న భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ భ‌వనాన్ని పూర్వ విద్యార్థుల సంఘం ఆర్థిక సాయంతో చేప‌ట్ట‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. వైద్యుల క‌ష్టాలు త‌న‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ వైద్యులు నెల‌లో ఒక‌రోజు ప‌ల్లెలు, గిరిజ‌న ప్రాంతాల‌కు కేటాయించాల‌ని కోరారు. ముఖ్యంగా గిరిజ‌న గ్రామాల్లో అంతుచిక్క‌ని వ్యాధులు క‌నిపిస్తున్నాయని, వాటికి వైద్యం అందించాల‌ని సూచించారు.

నిపుణులైన వైద్యులు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని.. కానీ, గ్రామీణులు కూడా ఈ దేశంలో భాగ‌మ‌ని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌పైనా దృష్టి పెట్టాల‌ని సూచించారు. వైద్యం అంద‌క‌.. ఎంతో మంది అగ‌చాట్లు ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం కూడాకృషి చేస్తుంద‌ని తెలిపారు.

పూర్వ విద్యార్థులు రంగ‌రాయ కాలేజీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ఎంతో మంది దాత‌ల స‌హ‌కారంలో ఏర్ప‌డిన ఈ కాలేజీలో అనేక మంది వైద్య విద్య చ‌దువుకున్నార‌ని తెలిపారు. ఈ క‌ళాశాల‌కు సేవాగుణం ఉంద‌ని పేర్కొన్నారు. వేలాది మంది వైద్యుల‌ను ఈ కాలేజీ అందిస్తోంద‌ని తెలిపారు.

కుల మ‌తాల‌కు అతీతంగా స‌మాజం గురించి ఆలోచించాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు. కొంద‌రు సంకుచిత మ‌న‌స్త‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. దీంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదుర‌వుతున్నాయ‌ని ప‌రోక్షంగా వైసీపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అరకు ప్రాంతంలో `సికిల్ సెల్ అనీమియా` బాధితుల కోసం `బ్లడ్ బ్యాంక్`ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.