కేంద్రానికి వేడి పుట్టించేస్తున్న రైతుల ఆందోళనలు

ఒకవైపు తీవ్రమైన చలి మరోవైపు రైతుల ఆందోళనలు ఢిల్లీని కమ్ముకుంటున్నాయి. గడ్డకట్టించే చలిలో కూడా కేంద్రప్రభుత్వానికి రైతుల ఆందోళన చెమటలు పట్టిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న రైతుల ఆందోళనలు ఏకంగా కేంద్రానికే వేడిపుట్టించేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈనెల 19వ తేదీన తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు మొదలుపెడతామంటూ రైతుసంఘాలు పంపిన అల్టిమేటమ్ సంచలనంగా మారింది.

ఇప్పటివరకు పంజాబ్, హర్యానా, రాజస్ధాన్ లోని రైతుసంఘాలు మాత్రమే నిరవధిక ఆందోళనల్లో పాల్గొంటే 19వ తేదీనుండి యావత్ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులు కూడా తమ ఆందోళనల్లో పార్టిసిపేట్ చేస్తామంటు కేంద్రాన్ని హెచ్చరించటం గమనార్హం. ఇప్పటివరకు కేంద్రమంత్రులు లేదా బీజేపీ జాతీయ నేతలు ఎవరు మాట్లాడినా ఉద్యమానికి జాతీయస్ధాయిలోని రైతు సంఘాల మద్దతు లేదంటు హేళనగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

రైతుఉద్యమం కేవలం పంజాబ్ కు మాత్రమే పరిమితమైందంటు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీనికి జవాబుగానా అన్నట్లు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని రైతులు కూడా ఢిల్లీకి రావటం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఢిల్లీ-హర్యానా సరిహద్దులను మాత్రమే మూసేసిన కేంద్రం తాజాగా ఢిల్లీ-రాజస్ధాన్ సరిహద్దులను కూడా మూసేసింది. భవిష్యత్తులో ఢిల్లీలోకి వచ్చే జాతీయరహదారులన్నింటినీ మూసేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం గట్టిగా చెబుతోంది. మహా అయితే సవరణలకు మాత్రమే అంగీకరించింది.

విచిత్రమేమిటంటే ఏ రైతుల ప్రయోజనాల కోసమైతే తాము చట్టాలు చేసినట్లు కేంద్రం చెబుతోందో అదే రైతులు అవే చట్టాలు తమకు వద్దంటూ మొత్తుకుంటున్నారు. రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్రం చట్టాలు చేసింది వాస్తవమే అయితే రైతులు డిమాండ్ చేసినట్లు ఆ చట్టాలను ఎందుకు రద్దు చేయటం లేదన్న ప్రశ్నకు కేంద్రం నుండి సమాధానం లేదు. అందుకనే కొత్త చట్టాలను కేవలం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్రం తీసుకొచ్చినట్లు రైతులు మండిపడుతున్నారు.

ఏదేమైనా 19వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్షలోకి దిగనున్న రైతు సంఘాల ప్రతినిధులకు మద్దతుగా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రైతులు రాబోతున్నారు. పంజాబ్, హర్యానాలోని గ్రామ గ్రామం నుండి రైతులు, రైతుల కుటుంబసభ్యులు ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘు వద్దకు చేరుకుంటున్నారు. ఆమరణదీక్షను రైతులు మొదలుపెడితే మాత్రం కేంద్రానికి వేడి పెరిగిపోవటం ఖాయం. ఎందుకంటే రైతుల ఆందోళన ఒక్కసారిగా దేశమంతా మొదలైతే దాన్ని ఆపటం కేంద్రానికి కష్టమనే చెప్పాలి. కేంద్రం వైఖరి ఎలాగుందంటే కోరి రైతులతో పెట్టుకుని తలగోక్కుంటున్నట్లుంది.