కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’

వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆ మాటలు ఇరు పార్టీల కేడర్ మనోభావాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయేమో అన్న భావనకు తాజాగా చోటుచేసుకున్న ఘటనలు బలాన్నిస్తున్నాయి.

ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ఆయన నివాసం సమీపంలో కేటీఆర్, కేసీఆర్ చిత్రంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తాజాగా కేటీఆర్ పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి వద్ద వైసీపీ జెండాలు పట్టుకున్న జగన్ అభిమానులు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ జై జగన్… జగన్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.

కొద్దిరోజుల కిందట బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేటీఆర్ భేటీ కావడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో చిరునవ్వులతో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు రాజకీయాల స్వరూపం ఎలా ఉండబోతోందన్న దానిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

గత ఐదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్, గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి.

ఈ తరుణంలో వైసీపీ, బీఆర్ఎస్ రెండూ ప్రతిపక్షాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలు కేవలం కార్యకర్తల హడావిడి మాత్రమేనా.. లేక ఉమ్మడి ప్రత్యర్థులను ఎదుర్కొనే వ్యూహాత్మక అడుగులలో భాగమా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.