ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన లోకేష్‌.. స్థానిక పార్టీ కేడ‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వైసీపీ హ‌యాంలో ప‌డిన ఇబ్బందుల‌ను.. అవ‌మానాల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అన్నీ నాకు బాగానే గుర్తున్నాయ‌ని తెలిపారు. బ‌దులుకు-బ‌దులు ఘాటుగా ఉంటుంద‌న్నారు.

అయితే.. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసున‌ని, కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని లోకేష్ సూచించారు. రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఆదిరెడ్డి భ‌వానీ(ఎర్ర‌న్నాయుడి కుమార్తె)ని వైసీపీ స‌భ్యులు అప్ప‌ట్లో వేధించార‌ని.. అదేవిథంగా త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రిని కూడా స‌భ‌లో దుర్భాష‌లాడార‌ని.. అన్నీగుర్తున్నాయ‌ని లోకేష్ చెప్పారు. అయితే.. కొంత స‌మ‌యం వేచి చూడాలన్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురైన వారికి అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. చ‌ట్టాన్ని త‌మ చుట్టంగా మార్చుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని వ‌దిలేది లేద‌న్నారు.

మ‌రో 100 ఏళ్లు టీడీపీ స‌జీవం

“తెలుగుదేశం పార్టీని మా తాత ఎన్టీఆర్ స్థాపించారు. ఇది పేద‌ల ప‌క్షపాత పార్టీ. దీనిని అంతం చేయాల‌ని, భూస్థాపితం చేయాలని చాలా మంది ప్ర‌య‌త్నించారు. కానీ, వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు. అంతేకాదు.. ఎప్ప‌టికీ నెర‌వేర‌వు. మ‌రో 100 ఏళ్ల పాటు టీడీపీ బ‌లంగా ఉంటుంది. మ‌రింత‌గా విస్త‌రిస్తుంది.“ అని నారా లోకేష్ చెప్పారు. కార్య‌క‌ర్త‌లే పార్టీకి బ‌ల‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు సైతం కార్య‌కర్త‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌న్నారు. చంద్ర‌బాబును అరెస్టు చేసిన‌ప్పుడు రాజ‌మండ్రి కార్య‌క‌ర్త‌లు ఉప్పెన‌లా త‌ర‌లి వ‌చ్చార‌ని.. ఆ సంగ‌తులు త‌న‌కు ఇప్ప‌టికీ గుర్తున్నాయ‌ని చెప్పారు.

ఏదున్నా.. నాలుగు గోడ‌ల మ‌ధ్యే..

పార్టీలో అల‌క‌లు.. బుజ్జ‌గింపులు ఉంటాయ‌ని.. అల‌క‌లు లేకుండా.. ఏ పార్టీ కూడా ఉండ‌ద‌ని, టీడీపీ వంటి భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు పెద్ద‌పీట వేసే పార్టీలో అల‌క‌లు ఒక జ‌బ్బుగా మారాయ‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. అయితే..ఏదున్నా కూడా.. రోడ్డున ప‌డితే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేల‌పైనా, ఎంపీల‌పైనా అల‌గ‌డం కంటే.. వారితో నేరుగా చ‌ర్చించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్యే స‌మ‌స్య‌-ప‌రిష్కారం రెండూ కావాల‌ని .. ఎవ‌రూ మీడియా ముందుకు వ‌చ్చి.. ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగ‌డం స‌రికాద‌ని నారా లోకేష్ సూచించారు.