గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. మరోవైపు ప్రజా వేదికలో జనంతో మమేకమవుతుంటారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తుంటారు. చివరికి మారుమూల గల్లీలో ప్రజలకు సమస్య ఏర్పడినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు. పాలనలో మంత్రి లోకేష్ సరికొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఓ గల్లీలో ప్రజలకు సమస్య వచ్చింది. తాము నివసిస్తున్న బజారు ఆరు అడుగులు మాత్రమే ఉందని, దానికి అడ్డంగా రెండు అడుగుల వెడల్పుతో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని స్థానికులు చెప్పారు. దాంతోపాటు పైప్‌లైన్ కూడా అడ్డుగా ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్‌ను తొలగించాలని అక్కడ ఉన్న మహిళలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల చాలామంది పడి గాయాల పాలయ్యారని తెలిపారు. ఇదే విషయాన్ని అచ్యుత అనే మహిళ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఇంత చిన్న సమస్యను సాధారణంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ చూసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో అక్కడి స్థానికుల ఆవేదనను చూసిన లోకేష్ వెంటనే స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ విప్ జీవి ఆంజనేయులును అలర్ట్ చేశారు. వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు.

ఇదొక్కటే కాదు.. వైద్య సహాయం కోసమో, అరబ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నామని ఎవరైనా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేస్తే చాలు, మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తున్నారు. లోకేష్ కార్యాలయ సిబ్బంది వెంటనే సమస్యను నమోదు చేసుకుని ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు.