ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు

ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు గురువారం తిరుపతిలో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసారు.

నందమూరి కుటుంబం తరపున రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఎన్టీఆర్ రాజు నందమూరి వీరాభిమానిగా ఎనలేని సేవలు చేశారని, రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా భక్తులకు అమూల్య సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు, ఆయన పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని జీవితాంతం ఎన్టీఆర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. బుధవారం తిరుపతిలో కన్నుమూశారు. ఈ మరణవార్తతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు అఖిల భారత కార్యదర్శిగా పనిచేసిన ఎన్టీఆర్ రాజు, తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలు అందించారు. ఎన్టీఆర్ స్వయంగా ఉన్నత పదవులు, ఎమ్మెల్యే అవకాశాలు ఆఫర్ చేసినప్పటికీ, అభిమానిగా ఉండటమే చాలునని తిరస్కరించారు. పదవులకన్నా ఆదర్శాలు ముఖ్యమని చాటిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.