అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?

ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని కుయుక్తులు పన్నుతోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు.

వారి వాదనలకు బలాన్ని చేకూర్చేలా విశాఖపట్నంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం రహేజా కార్ప్‌కు కేటాయించిన భూములపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ ఘాటుగానే స్పందించారు. యువత భవిష్యత్తుపై ఇంత ద్వేషం ఎందుకు జగన్? రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడులను ప్రతి అడుగులోనూ అడ్డుకోవాలనే ప్రయత్నం ఎందుకు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కలిపి లక్షకు పైగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు అందే అవకాశం ఉందన్నారు. టీ సీఎస్, కాగ్నిజెంట్, సత్వా, తాజాగా రహేజా ఐటీ పార్కులపై వైసీపీ పిల్‌లు దాఖలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఏపీ అభివృద్ధిని, కూటమి ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేలా కేసులు వేయడం వైసీపీకి మొదటి నుంచి అలవాటు అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ పై, పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లపై కేసులు వేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లక్షలాదిమందికి ఉపాధిని చేకూర్చే ఐటి కంపెనీలకు భూముల కేటాయింపు పై కేసులు వేయటం వారి దుర్మార్గపు చర్యకు నిదర్శనమని అంటున్నారు.

వారికి అభివృద్ధి చేయటం చేతకాదు, పైగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని వారి భావన. దీనిపైనే.. అభివృద్ధికి ఆటంకాలు తగునా జగన్ అంటూ లోకేష్ ప్రశ్నించారు.