అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్ తో చెప్పారు. అయినా.. ఒక ఛాన్స్ ఇవ్వండి నేను నిరూపించుకుంటాను అని ఆ కలెక్టర్ అన్నారు. చివరకు ఆ ఉన్నతాధికారిని సీఎం భేష్ అంటూ ప్రశంసించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీ సచివాలయంలో ఈరోజు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు తమ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ప్రజెంట్ చేయగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి అమలు చేస్తున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని వివరించారు. ప్రభాకర్ రెడ్డి వివరించిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని సీఎం తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని, ఇది సామాజిక మార్పుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభాకర్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ పోస్టింగ్ సమయంలో సీనియర్ అధికారుల నుంచి ఆయనపై సానుకూల అభిప్రాయాలు రాలేదని, ఎవరూ సిఫార్సు చేయలేదని తెలిపారు. అయినప్పటికీ ఒక్క అవకాశం ఇవ్వమని ప్రభాకర్ రెడ్డి తనను కోరగా, అవకాశం ఇచ్చానని, ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పట్టుదల ఉంటే పనితీరుతోనే నిరూపించవచ్చు అని సీఎం వ్యాఖ్యానించారు.

ముస్తాబు కార్యక్రమం కింద పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కొని, సక్రమంగా సిద్ధమై తరగతుల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. దీని వల్ల విద్యార్థులే కాకుండా వారి కుటుంబాల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడిందన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నిటిలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 79 లక్షల మంది విద్యార్థులతో పాటు దాదాపు 2 కోట్ల మందిపై ఈ కార్యక్రమం ప్రభావం చూపుతుందని సీఎం తెలిపారు.