పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు.

పాఠశాల గదులు, ల్యాబ్‌ను పరిశీలించిన సందర్భంగా విద్యార్థులకు అవసరమైన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌కు కంప్యూటర్లు, గ్రంథాలయానికి పుస్తకాలు అందిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, సొంత నిధులతో పాఠశాలకు 25 కొత్త కంప్యూటర్లను అందజేశారు.

అంతేకాకుండా గ్రంథాలయాన్ని పుస్తకాలతో నింపుతానన్న హామీని కూడా ఆయన నెరవేర్చారు. చిన్నారులకు ఉపయోగపడే బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, కన్నడ, ఒడియా వంటి పలు భాషల పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

ఈ సదుపాయాల ఏర్పాటుకు సుమారు రూ.25 లక్షల వరకు పవన్ కల్యాణ్ సొంతంగా వెచ్చించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కలిసి పాఠశాలను సందర్శించి ఈ కంప్యూటర్లు, పుస్తకాలను అధికారికంగా విద్యార్థులకు అందజేశారు.

పవన్ కల్యాణ్ విద్యారంగానికి సొంత నిధులతో తోడ్పాటు అందించడం ఇదే తొలిసారి కాదు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో పాఠశాలల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తూ, అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గతంలో అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లిలో పాఠశాలకు ఆటస్థలం లేకపోవడంతో రూ.65 లక్షల సొంత నిధులతో స్థలం కొనుగోలు చేసి అందజేయగా, కడప మున్సిపల్ స్కూల్‌లో అధునాతన మోడల్ కిచెన్‌ను ఏర్పాటు చేయించారు. తాజాగా చిలకలూరిపేట హైస్కూల్‌కు కంప్యూటర్లు, పుస్తకాలు అందజేయడం ద్వారా మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్న నాయకుడిగా నిలిచారు.