ఇక‌… బీజేపీపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే జ‌గ‌న్‌.. !

కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుంద‌న్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ విషయం తరచుగా పార్టీలోను చర్చ నడుస్తోంది. అందుకే కేవలం రాష్ట్రంలోని టిడిపి నేతలపై మాత్రమే వైసిపి నాయకులు తరచుగా కామెంట్లు చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మాత్రం ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ఏదో తేడా జరిగిందని చెబుతున్నప్పటికీ భారీ స్థాయిలో కేంద్రంపై ఎప్పుడు విమర్శలు చేయ‌క పోవడానికి కారణం బిజెపి తమకు అండగా ఉంటుందన్న భావనతోనే.

అయితే ఇక ఇప్పటివరకు ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో బిజెపి మీద వైసిపి పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఒకేలా ఉండ‌రు. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ ఉంటారు. ఈ విషయంలో కేంద్రంలోని బిజెపి పెద్దలు కూడా ఏపీలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంతో కలిసి ఉండకపోతే తమకు కూడా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోఏ తాజాగా అనేక మార్పుల దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. జగన్ ను టార్గెట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా చెప్పడం గ‌మ‌నార్హం. 2014 నుంచి జరిగిన రాజకీయాలను చూసుకుంటే ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ప్రధానంగా మోడీ ఎప్పుడు నేరుగా జగన్ను విమర్శించింది లేదు. జగన్ పై కామెంట్లు చేసింది కూడా లేదు. ఆయన ఏపీలో అనేక సందర్భాల్లో పర్యటించినప్పుడు కూడా వైసిపిపై కానీ జగన్ పై కానీ ఆయన ఎప్పుడూ పన్నెత్తు మాట అనలేదు.

కానీ తాజాగా మాత్రం బిజెపి ఎంపీలకు క్లాస్ పీకారు. జగన్ చేస్తున్న విమర్శలను దీటుగా స్పందించాలని దీటుగా ఎదుర్కొనాలని ఉపేక్షించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేయడంతో ఇక వైసిపి విషయంలో బిజెపి స్టాండ్ ఏంటి అనేది స్పష్టమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కూడా బిజెపి నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైసిపి పై విమర్శలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు.

కానీ ఇప్పుడు కేంద్రంలోని పెద్దలు ముఖ్యంగా ప్రధానమంత్రి నేరుగా బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేయడంతో ఇక వైసిపి పై వారు విజృంభించడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది. దీంతో బిజెపి పై ఆశల గనక పెట్టుకుంటే జగన్ వదులుకోవాల్సిందేనని పరిశీలకులు చెబుతున్నారు.