వెన‌క్కి త‌గ్గాలా? వ‌ద్దా? అన్ని విధాలా ఇరుక్కున్న మోడీ!

Narendra Modi

మార్పు మంచిదే– అంటూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు.. ఆయ‌న‌కు పొలిటిక‌ల్ సంకటంగా ప‌రిణ‌మించాయి. ఇంటా బ‌య‌టా కూడా ఆయ‌న‌కు ఇవి స‌వాళ్ల‌ను రువ్వుతున్నాయి. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రైతాంగం.. ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి చూస్తున్నాం. తాజాగా జ‌రిగిన భార‌త్ బంద్ మ‌రింత వేడి పుట్టించింది. ఆదిలో రైతుల ఉద్య‌మాన్ని లైట్‌గా తీసుకున్న మోడీ.. త‌ర్వాత ఇది దేశ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డం.. ప్ర‌ధాన పార్టీల‌న్నీ.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పడం.. రాష్ట్రాల‌కు రాష్ట్రాలే మోడీపై ఈ చ‌ట్టాల‌ను అడ్డు పెట్టుకుని క‌త్తి దూయ‌డం మ‌రింత‌గా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు వీటిని వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు(చ‌ట్టాల‌ను ర‌ద్దు) త‌మ ఉద్య‌మాన్ని ఆప‌బోమ‌ని.. రైతులు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా మోడీకి ఇబ్బందులు తెస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త్వ‌ర‌లోనే మూడు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉండ‌డం.. ఆపై.. యూపీలోనూ ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం మెండుగా ఉండ‌డంతో రైతుల ఓట్లు కీల‌కంగా ఉన్న ఆయారాష్ట్రాల్లో బీజేపీ ప‌రిస్థితి దారుణంగా ఉండే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిట‌న్‌, యూర‌ప్ దేశాల్లోనూ నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాని నిర్ణ‌యాల‌కు ప‌ట్టం గ‌ట్టిన ప్ర‌వాస భారతీయులు ఇప్పుడు రైతు చ‌ట్టాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ.. ఆందోళ‌న‌ల‌ను తీవ్ర‌త‌రం చేశారు. పైగా దేశంలో జ‌రుగుతున్న రైతు ఉద్య‌మానికి వారి నుంచి నిధులు కూడా అందుతున్నాయంటే.. ఈ ప‌రిణామం చాలా తీవ్రంగానే ఉంద‌ని అంటున్నారు.

ఇక‌, ఆయా దేశాల్లోనూ ప్ర‌భుత్వాలు మోడీని హెచ్చ‌రిస్తున్నాయి. రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే బ్రిట‌న్ త‌దిత‌ర దేశాలు కూడా రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ధానిని విమ‌ర్శించాయి. ఈ క్ర‌మంలో తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన రైతు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాలా? లేక మొండిగా వ్య‌వ‌హ‌రించాలా? అనే విష‌యంలో మోడీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనికి రెండు కీల‌క కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి వెన‌క్కి తీసుకుంటే.. దేశంలో రైతులు శాంతించినా.. ప్ర‌తిప‌క్షాలు గేలి చేస్తాయి. రైతుల‌కు న్యాయం చేయ‌లేక‌పోగా.. వారిని ఇబ్బంది పెట్టే చ‌ట్టాలు తెచ్చి.. మోడీ తోక‌ముడిచారంటూ.. ప్ర‌చారం చేయ‌డం దీనిలో ఒక భాగం. ఇక‌, అంత‌ర్జాతీయంగా తీసుకుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ ప్ర‌భ .. అంత‌ర్జాతీయంగా వెలిగిపోతోంద‌న్న బీజేపీ ప్ర‌చారానికి గండి ప‌డుతుంది.

ఎందుకంటే.. మోడీ ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటే.. అంత‌ర్జాతీయంగా కూడా ఆయ‌న అనే విష‌యాల‌పై మాట్లాడి ఒప్పించిన అంశాల్లోనూ ఇలా అనేక లోపాలున్నాయ‌ని.. చైనా, పాకిస్థాన్‌ల నుంచి కూడా ఎదురుదాడి త‌ప్ప‌దు. పోనీ.. ఈ చ‌ట్టాల‌ను కొన‌సాగిస్తే.. అత్యంత కీల‌క‌మైన మూడో సారి అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌డం అంత ఈజీకాదు.. ఇలా.. మోడీ తాను తెచ్చిన రైతు చ‌ట్టాల చ‌ట్రంలో తానే న‌లిగిపోతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి మోడీ ఏం చేస్తారో చూడాలి.