ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. తాజాగా అమరావతి సచివాలయంలో వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సును నిర్వహించారు. దీనిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు తీసుకువస్తున్నట్టు చెప్పారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలను జోన్లు, క్లస్టర్లు, కారిడార్లుగా అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. తద్వారా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం మరింత పెరుగుతుందని తెలిపారు. ఇదే సమయంలో ప్రజలకు.. మంత్రులు, అధికారులు చేరువ కావాలన్నారు. సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామన్న సీఎం .. ఒక్క పెన్షన్లలోనే ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలకు పైగా పేదలకు పంపిణీ చేశామని వివరించా రు. ఈ విషయాలను ప్రజలకు మరింత ఎక్కువగా వివరించాలని సూచించారు.
ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ, గత వైసీపీ పాలన వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ బ్రాండ్ తిరిగి తీసుకురాగలిగామన్నారు. విశాఖ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని, యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పారు. ఇక, రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 12.02 శాతం గ్రోత్ రేట్ వచ్చిందన్న సీఎం.. రెండో త్రైమాసికంలో 11.28 శాతం వృద్ధి నమోదు అయ్యిందని వివరించారు.
వైసీపీ అలా చేసి..
వైసీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు(పీపీఎ) రద్దు చేసి తప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. దీంతో 9 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. కూటమి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ను 5.19 రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు దానిని 4.92 రూపాయలకు తగ్గించామన్నారు. ప్రజలపై భారం పడకూడదని నిర్ణయించామని చెప్పారు. వచ్చే ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్కు రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates