రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ – ఒక రోజులో ఎన్ని లక్షల కోట్లు?

గ‌త నెల‌లో ఏపీలోని విశాఖ‌లో నిర్వ‌హించిన సీఐఐ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు పోటీ ప‌డుతున్న‌ట్టుగా.. తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా రెండు రోజ‌లు తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2025ను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. రెండు రోజులుగా సాగే ఈ స‌ద‌స్సులో సోమ‌వారం.. తొలిరోజు భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. దేశ, విదేశాల‌కు చెందిన‌ వివిధ కంపెనీలు 2.48 కోట్ల రూపాయ‌ల మేర‌కు తొలిరోజు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కీల‌క‌మైన డీప్ టెక్నాల‌జీ, హ‌రిత ఇంధ‌నం, ఏరో స్పేస్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా డీప్ టెక్నాల‌జీలోనే 75 వేల కోట్ల‌రూపాయ‌ల ఒప్పందాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

పేరు ఏదైనా..

వాస్త‌వానికి తెలంగాణ రైజింగ్ స‌ద‌స్సు అనిపేరు పెట్టినా.. ఆది నుంచి సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబ‌డుల‌పైనే దృష్టి పెట్టారు. పొరుగున ఉన్న ఏపీతో పోటీ ప‌డ‌తామ‌ని ఆయ‌న అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రైజింగ్ స‌ద‌స్సుకు గ‌త నెల‌లోనే ఆలోచ‌న చేశారు. అప్ప‌టి నుంచి వ‌డివ‌డిగా ప‌నులు చేప‌ట్టారు. దేశ ప్ర‌ధాని నుంచి రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు, ప్ర‌పంచ దేశాల ప్ర‌తినిధుల నుంచి సినీ తార‌ల వ‌ర‌కు అన్ని రంగాల వారినీ ఆహ్వానించారు. మొత్తంగా సుమారు రూ.100 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో తొలిరోజు విజ‌యం ద‌క్కించుకున్నారు.

రెండో రోజు రైజింగ్ డిక్ట‌రేష‌న్‌

రెండో రోజు స‌ద‌స్సులో మంగ‌ళ‌వారం.. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటును ఆవిష్క‌రించ‌నున్నారు. త‌ద్వారా.. 2047 నాటికి తెలంగాణ అభివృద్ది, చేయ‌నున్న ప‌నులను సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే 30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న ద‌రిమిలా.. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటుకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. కాగా, ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన విదేశీ అతిథుల‌కు భారీ ఎత్తున విందు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇవీ.. తొలిరోజు ఒప్పందాలు..

+ డీప్ టెక్నాలజీ: 75 వేల కోట్లు

+ గ్రీన్ ఎనర్జీ: 27 వేల కోట్లు

+ పునరుత్పాదక ఇంధ‌నం: 39,700 కోట్లు

+ ఏరోస్పోస్, డిఫెన్స్: 19,350 కోట్లు

+ ఏవియేషన్: 15 వేల కోట్లు

+ తయారీ రంగం: 13,500 కోట్లు

+ ఉక్కు: 7 వేల కోట్లు

+ టెక్స్‌టైల్స్: 4 వేల కోట్లు