ఏలూరులో వింత వ్యాధికి కారణం తెలిసిందా ?

ఏలూరులో కలకలం సృష్టిస్తున్న వింతవ్యాధికి కారణాలను ఎయిమ్స్ వైద్యులు కనుగొన్నారా ? అవుననే అంటున్నారు బీజేపీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు. ప్రజలు హఠాత్తుగా అస్వస్ధతకు గురవ్వటానికి ప్రధాన కారణం భారలోహం (లెడ్) సీసమే అంటున్నారు. ఏలూరులో చిన్నారులు, పెద్దవాళ్ళు శనివారం మధ్యాహ్నం నుండి హఠాత్తుగా ఉన్నవాళ్ళు ఉన్నటుండి పడిపోతున్న విషయం కలకలం సృష్టించింది. నోట్లోనుండి నురుగు వచ్చేయటం, కాళ్ళు చేతులు కొట్టుకుంటుండం అంటే ఫిట్స్ లాంటి సమస్యతో పడిపోతున్నారు.

శని, ఆది వారాల్లో హఠాత్తుగా మొదలైన సమస్యతో సుమారు 520 మంది ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. ఇటువంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రుల్లో చేరటం బహుశా దేశం మొత్తం మీద ఇదే మొదటిసారి. దాంతో వింత వ్యాధికి మూల కారణం ఏమిటో తెలీక వైద్యులు, వైద్య నిపుణులు షాక్ తిన్నారు. మూలకారణం తెలుసుకునేందుకు మంగళగిరి, ఢిల్లీ నుండి ఎయిమ్స్ లోని వైద్య నిపుణులు, మెడికల్ శాస్త్రజ్ఞులతో ఏలూరు ఆసుపత్రి డాక్టర్లు మాట్లాడుతునే ఉన్నారు. ఎయిమ్స్ నుండి డాక్టర్లు కూడా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

ఇదే విషయమై జీవిఎల్ మాట్లాడుతు రోగుల రక్త నమూలాలను పరిశీలించినపుడు సీసము, నికెల్ అనే లోహాల అవశేషాలు బాధితుల రక్తంలో ఎక్కువగా ఉండటాన్ని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు గమనించారన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ పరిశీలనలో బయటపడిన వివరాలను మంగళగిరి ఎయిమ్స్ ద్వారా రాష్ట్రప్రభుత్వానికి అందించినట్లు కూడా ఎంపి చెప్పారు. స్ధానికంగా ఉండే మంచినీటి, పాల నమూనాలను పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు పంపాలని కూడా ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు అడిగారు.

సీసం కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయని, ఎక్కువగా బ్యాటరీల్లో ఉండే ఈ లోహం మంచినీరు, పాల ద్వారా రోగుల శరీరాల్లోకి వెళ్ళి ఉంటుందని ఎయిమ్స్ లోని నిపుణులు అనుమానిస్తున్నట్లు జీవిఎల్ చెప్పారు. సీసమైనా నికెల్ అయినా ఉండాల్సిన స్దాయికి మించి శరీరంలోకి ప్రవేశిస్తే ఇటువంటి దుష్ఫలితాలే వస్తాయని ఎయిమ్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏలూరుకు చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్య్ల్యూహెచ్వో), ఎయిమ్స్ నిపుణులు ఏమి చెబుతారో చూడాల్సిందే.