ముందు తెలీద‌ని-ఇప్పుడు తెలుస‌ని: సుబ్బారెడ్డి పిల్లిమొగ్గ‌లు

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యిని వినియోగించిన కేసు వ్య‌వ‌హారంపై అప్ప‌టి టీటీడీ బోర్డు చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారు. గ‌తంలో ఈ కేసు వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. “అబ్బే.. అంతా రాజ‌కీయం. చంద్ర‌బాబు కావాల‌నే మాపై నింద‌లు వేస్తున్నారు“ అని బుకాయించారు. అంతేకాదు.. అస‌లు క‌ల్తీ ఎక్క‌డ జ‌రిగిందో నిరూపించాల‌ని స‌వాల్ చేశారు.

ఇదేస‌మ‌యంలో వైవీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని, సీబీఐని వేయాల‌ని అభ్య‌ర్థించారు. ఇలా ఈ కేసును సీబీఐకి అప్ప‌గించే వ‌ర‌కు న్యాయ పోరాటం చేశారు. దీంతో వైవీ సుబ్బా రెడ్డి పాత్రపై ఎవ‌రూ కామెంట్లు చేయ‌లేదు. ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కింద‌ట వైవీ అనుచ‌రుడు, ఆయ‌న‌కు ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా ప‌నిచేసిన చిన్న అప్ప‌న్న‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ నేప‌థ్యంలోనే చిన్న అప్ప‌న్న బ్యాంకు ఖాతాల్లో 4.5 కోట్ల రూపాయ‌లు జ‌మ అయిన‌ట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆ నిధులు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి.? ఎలా వ‌చ్చాయి? అన్న విష‌యాల‌పై కూపీ లాగుతున్నారు. మ‌రోవైపు.. టీటీడీ స్టోర్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంను అదుపులోకి తీసుకుని విచారించారు. అత‌నిని అరెస్టు కూడా చేశారు. ఈ ప‌రిణామాల‌తో వైవీ అలెర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న హ‌ఠాత్తుగా గురువారం ఢిల్లీలోని త‌న నివాసంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

నిజానికి ఇన్నాళ్ల‌లో ఎప్పుడూ వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు రాలేదు. కానీ, ఉచ్చు బిగిస్తున్న క్ర‌మంలో ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించిన వైవీ.. కీల‌క విష‌యాలు చెప్పుకొచ్చారు. తాను టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో క‌ల్తీ నెయ్యి వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే.. ఆ క‌ల్తీ నెయ్యి ట్యాంక‌ర్‌ను తిప్పి పంపించేయాల‌ని తాను అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలిపారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆ లారీని అనుతించ‌వ‌ద్ద‌ని కూడా తాను తేల్చి చెప్పిన‌ట్టు పేర్కొన్నారు.

కానీ.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అధికారులు త‌న‌కు చెప్ప‌లేద‌ని వెల్ల‌డించారు. అంటే.. దీనిని బ‌ట్టి. ముందు త‌న‌కు న‌కిలీ వ్య‌వ‌హార‌మే తెలియ‌ద‌ని చెప్పిన వైవీ.. తాజాగా మాత్రం న‌కిలీ నెయ్యి వ‌చ్చింద‌ని ఒప్పుకొన్నారు. మొత్తానికి ఈ కేసు తీవ్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో మున్ముందు ఎన్ని విష‌యాలు వెలుగు చూస్తాయో చూడాలి.