పోల‌వరానికి మ‌హ‌ర్ద‌శ‌.. కొత్త జిల్లాతో మార్పులు ఇవే

పోల‌వ‌రం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పేరు అంద‌రికీ తెలిసినా.. ఇక‌పై జిల్లాగా ఇది రూపుదిద్దుకోనుంది. వాస్త‌వానికి పోల‌వరం గిరిజ‌న ప్రాంతం. అందుకే.. దీనిని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంగా పేర్కొన్నారు. ఆ సామాజిక‌ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేశారు. అయితే.. తాజాగా ఈ ప్రాంతాన్ని కొత్త‌గా జిల్లా చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం ప్రాంతాన్ని పోల‌వ‌రంలో విలీనం చేయ‌డం ద్వారా.. కొత్త జిల్లాగా దీనిని ఏర్పాటు చేయ‌నున్నారు.

వాస్త‌వానికి రంపచోడ‌వ‌రం కూడా ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మే. అయితే.. దీనిని కూడా.. పోల‌వ‌రంలో విలీనం చేయనున్నారు. త‌ద్వారా.. ఎస్టీ ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న సంక‌ల్పం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, పోలవ‌రం ప్రాంతాన్ని ప్ర‌త్యేక జిల్లాగా రూపొందించ‌డానికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు ఉన్నాయి. 1) పోలవరం ముంపు ప్రాంతంలోని అధికశాతం ప్రాంతాలు చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లలో ఉన్నాయి. దీంతో ఇక్క‌డి వారికి పునరావాస ప్రాంతాలు అక్కడే ఏర్పాటవుతున్నాయి.

దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే.. ప్ర‌త్యేకంగా జిల్లా ఏర్పాటు చేయడ‌మే బెట‌ర్ అని సీఎం భావించారు. ఇక‌, కొత్త‌గా పోల‌వ‌రం జిల్లాను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. పొరుగున ఉన్న అల్లూరి సీతా రామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు ఇక్క‌డివారు వెళ్లి ప‌నులు చేయించుకోవాల్సిన అవ‌స‌రం త‌ప్ప నుంది. అదేస‌మ‌యంలో గిరిజన ప్రాంతంలో కొత్త ర‌హ‌దారులు, టెలిక‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌లు అందుబాటులోకి వ‌స్తాయి.

అలానే కొత్త ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, కేంద్రం నుంచి ప్ర‌త్యేకంగా నిధులు తెచ్చుకునేందుకు కూడా అవ కాశం ఉంటుంది. వెనుక‌బ‌డిన జిల్లాల‌తోపాటు.. 2022 నుంచి గిరిజ‌న జిల్లాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నిధులు కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పోల‌వ‌రం అభివృద్ధి చెందేందుకు కీల‌క‌మైన మార్గంగా కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్ర‌బాబు మార్గం సుగ‌మం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై అభ్యంత‌రాలు స్వీక‌రించి.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేయ‌నుంది.